కొత్తగా ఏదైనా నేర్చుకుంటే దాన్నే సమయం సందర్భం లేకుండా చేస్తూ, కనపడినవాడికి తమ కొత్త విద్యలోని నైపుణ్యాన్ని గురించీ, కొత్తగా నేర్చుకున్న విషయవిజ్ఞానాన్ని గురించీ చెప్పిచెప్పీ విసిగించి వేసారిపోయేలా చెయ్యడం మనం సాధారణంగా చేసేపని. అప్పుడే “కొత్తబిక్షగాడు పొద్దెరగడు” అని వ్యవహరించేస్తూ ఉంటారు.
విశాల్ భరద్వాజ్ హిందీ సినిమా ‘మఖ్బూల్’లో ఇలాంటిదే ఒక మతానికి సంబంధించిన సామెత చెబుతాడు. “నయా ముసల్మాన్ హై, పాంచ్ బార్ నమాజ్ తో పఢేగా హీ” అని. అంటే, ‘కొత్తముస్లిం కదా, ప్రస్తుతానికి ఐదుసార్లు నమాజ్ ఖచ్చితంగా చదువుతాడ్లే!’ అని అర్థం. ఈ విధంగా, కొత్తగా మతంపుచ్చుకున్నవాళ్ళలో ఈ ధోరణివుండటం సహజంగా జరిగిపోతూ ఉంటుంది. మాటిమాటికీ మతపరమైన references వాళ్ళమాటల్లో కనిపించేది అందుకే.
కొత్తగా మతంపుచ్చుకున్న ఒక క్రైస్తవ మిత్రుడి వింతధోరణి గురించి వాసిలి సురేష్ తన బ్లాగు ‘తెలుగు నేస్తమాలో’ రాసినటపా చదివేసరికీ, మా కాలేజిలో జరిగిన మతచర్చలు గుర్తొచ్చాయి. నేను చదివింది ఇంగ్లీషు సాహిత్యం, అందులో ఆధునిక సాహిత్యంలోని సింహభాగం చర్చ్ (Church) వ్యతిరేక సాహిత్యం గనక, మా చర్చల్లో మతం తరచూ receiving endలో ఉండేది. బైబిల్ గ్రంధాన్ని గురించికూడా ఆంగ్లసాహిత్య చరిత్రలో భాగంగా చదువుకున్న మాకు ఈ వింతపోకడల్ని సాధికారంగా ఖండించే అవకాశం ఉండటంతో, క్లాసులోవున్న క్రైస్తవ మిత్రులు తమ నిరసనని బాహాటంగా చెప్పేవారు కాదు. కానీ, క్లాసు ముగిసిన తరువాత కాస్త informal గా జరిగే మాటల్లో “మతాన్ని గురించి అలామాట్లాడితే ఎలా?” అనేవాళ్ళు.
ఈ సంవాదాల్లో జరిగేచర్చల్లో ముఖ్యంగా వచ్చే విషయాలు “మనమంతా పాపులం” అనే నమ్మకం. ఇతర మతాల దేవుళ్ళపటాలు,ప్రసాదాలూ తాకకూడదు. సినిమాలు చూడకూడదు,సినిమా సంగీతం వినకూడదు లాంటివి. మొదటి నమ్మకానికి కనీసం బైబిల్ లో కొంత ప్రాదిపదిక వున్నా, మిగతా రెండిటీకీ క్రైస్తవమతానికీ సుదూరంలోకూడా సంబంధం లేదు. కానీ,దినదిన వ్యవహారాలలో ఇలాంటివి మాటిమాటికీ ఎదురై, ఎప్పుడూ ప్రశ్నలు తలెత్తేవి. అందుకే తెగని చర్చలకు మూలమయ్యేవి.
మా ఫ్రొఫెసర్ ఒకాయన సరదాగా “పాపిగళూ బన్ని అంతా బోర్డ్ హాకి కరితారప్పా! నీవు హోగబేడ. నీ పాపియేనో?” అని కన్నడలో ప్రశ్నించేవాడు. అంటే, “పాపులారా రండి అని బోర్డుపెట్టుకుని మరీపిలుస్తారయ్యా! నువ్వెళ్ళకు. నువ్వు పాపివి కావుకదా?” అనర్థం. క్రైస్తవమతంలో original sin అనే ఒక భావన ఉంది.ఆడమ్- ఈవ్ భగవంతుడు నిషేధించిన (జ్ఞానఫలం)పండు (forbidden fruit) తినడం వలన దేవుడు సృష్టించిన పవిత్రలోకానికి దూరమయ్యారని. కాబట్టి, ఆడమ్-ఈవ్ సంతానమైన అందరిమనుషులూ పుట్టుకతో ఆ పాపాన్ని పంచుకుని పుడతారని ఒక నమ్మకం. ఆ పాపం నుంచీ పరిహారం పొందడానికి దేవుడిదారి ఎంచుకోవాలనే ఆధారంతో ఈ నమ్మకాన్ని మతవ్యాప్తికి బాగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయం మీద క్రైస్తవుల్లోని వివిధ శాఖల్లోకూడా బహు విభేధాలున్నాయి.
మా కాలేజి చర్చల్లో తేలిన conclusion ఏమిటంటే,‘if eating the fruit of knowledge is a sin, it’s good that the sin happened’ అని. జ్ఞానఫలం తినకుండా ఉంటే, మనిషి మనషిగా ఉండేవాడుకాదు కదా! అందుకే, ఆ “పాపం” జరగడం మంచిదనే నిర్ణయానికొచ్చేవాళ్ళం. ఆపని చెయ్యకుండా ఉంటే మనుషజాతికూడా అనభూతులులేని కూరగాయలో,జంతువులలాగానో ఉండేవాళ్ళంకదా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ పాపం, పాపమెలా అవుతుంది అనేది ప్రశ్నార్థకమే! అంతేకాకుండా, మతానికి ‘గిల్ట్’ (అపరాధభావన) ప్రాతిపదికైతే,దాంట్లో ఎస్కేపిజమే తప్ప జీవనమూల్యాల సాధన సాధ్యమా అనేది తరచూ ఉద్భచే సందేహం.
ఇక ఇతరమతాల దేవుళ్ళపటాలనూ,ప్రసాదాన్నీ తాకకూడదు అనేది కేవలం అపోహేతప్ప బైబిల్ ను ప్రాతిపదికగా చేసుకున్న నమ్మకమైతే అస్సలు కాదు. చారిత్రకంగా రోమన్ సారాజ్యానికి వ్యతిరేకంగా ఒక reactionary మతంగా క్రైస్తవమతం ఉధ్బవించినా, (ఆ తరువాత కాలంలో రాజకీయ ఉద్దేశాలతో ప్రారంభమైన క్రుసేడర్ సమయం మినహా) చాలావరకూ శాంతీ, ప్రేమలను ఆధారం చేసుకుని వ్యాప్తి చెందింది. అందుకే, ఇస్లాం మతంలో కనిపించే పరమతంపట్ల వ్యతిరేకత ( పేగన్లకు వ్యతిరేకంగా ఇస్లాంలో చాలా విధివిధానాలున్నాయి) కనబరిచే అవకాశం లేదు. అదీ ముఖ్యంగా “ఒక అంగీకారాత్మక ప్రాతిపదికన రాయబడిన” కొత్తనిబంధన గ్రంధం ఆవిధంగా ప్రవచించే అవకాశమే లేదు.
ఇక కొత్తక్రైస్తవుల సినిమా ప్రహసనం గురించి నా ఇదివరకటి టపాలో చెప్పాను చూడండి.
అందుకే, కొత్తగామతం పుచ్చుకున్నవాళ్ళ పోకడల్లో ఫాదర్లూ, పాస్టర్లూ, ఇతర మతప్రచారకులు నింపే అపోహల పాత్ర చాలా ఉందనిపిస్తుంది. హిందుమతంలోని అపోహలకు చాలా కారణాలుండొచ్చు. కారణం ఇక్కడ ఏక గ్రంధం,ఏక ప్రవక్త, ఏక దేవుడు లేడు. కానీ, క్రైస్తవం బైబిల్ కు కట్టుబడింది కాబట్టి (పేరే కొత్తనిబంధన గ్రంధం కదా!), నియో- క్రైస్తవులు కనీసం బైబిల్ ని పుర్తిగా చదువుకోవాలేమో!
****