పర్ణశాల

June 9, 2009

పదికోట్ల మందిలో పదివేల పాఠకులు దొరక్కపోవడం ఎవరి తప్పు?

Filed under: సమాజం, సాహిత్యం — kathimaheshkumar @ 10:57 am

అమెరికా నుంచీ వెలువడే ఒక తెలుగు పత్రిక (తెలుగునాడి) మూతపడిందని కాశ్యప్ తన బ్లాగులో ‘అక్షరం తలదించుకుంది’ అని శీర్షికపెట్టి బ్రహ్మానందం గారు రాసిన ఒక హృద్యమైన వ్యాసాన్ని ప్రచురించారు. బ్రహ్మానందం గారు ఆ పత్రిక గుణగణాల్ని వివరించి, కొన్ని కన్నీళ్ళు కార్చి, ఆ చచ్చిన పత్రికని బ్రతికించడాని ఎవరైనా ఆక్సిజన్ ఇస్తే తనవంతు సిలిండర్ సహాయం చేస్తానని ఆ వ్యాసంలో ప్రతిజ్ఞ చేశారు.

ఆ వ్యాసం చదివి నాకూ బాధకలిగింది. ముఖ్యంగా “అమెరికా నుండి వెలువడే రీడర్స్ డైజస్ట్ నమూనాలో ఆంధ్రదేశంలో వచ్చే వివిధ పత్రికల్లో వచ్చిన మంచి వ్యాసాలూ, కథలూ ఏర్చి కూర్చి వేయడమూ, తెలుగు డయాస్పోరా కథలూ, వ్యాసాలూ ప్రచురించడమూ ఈ తెలుగునాడి చేస్తోంది. అన్ని వర్గాల పాఠకుల్నీ అలరిస్తూ పాత కొత్త సాహిత్యాల్ని పరిచయం చేస్తోంది. ముఖ్యంగా తెలుగు సినిమా వ్యాసాలు చక్కగా ఉంటాయి. సినిమా సమీక్షలు బావుంటాయి. బాల సాహిత్యమంటూ రెండు మూడు పేజీలుంటాయి. అన్నిటికన్నా ముఖ్యం పత్రికకి వాడే పేపరు అత్యంత నాణ్యమైనది. ఇలా ఎంతో వైవిధ్యంగా ఒక తెలుగు పత్రిక ప్రచురింపబడ్డం చూసి ప్రతీ తెలుగువాడూ గర్వ పడాలి.” అంటూ వర్ణించిన ఆ పత్రిక గుణగణాల్ని చదివి మరీ బాధపడ్డాను. ఒక్క డయాస్పొరా కథల్ని మినహాయిస్తే సాక్షి దినపత్రిక ‘ఫ్యామిలీ’ సెక్షన్లో నాకు ఈ పత్రికలోని గుణగణాలన్నీ ప్రతిరోజూ కనిపించడమే నా బలవంతమైన బాధకు కారణం.

చాలా నికృష్టమైన పోలికలాగా, నా టేస్ట్ పరమ చీప్ గా కనిపిస్తే నేనేమీ చెయ్యలేను. నామట్టుకునాకు ఆ గుణగణాల వర్ణన అచ్చుగుద్దినట్లు చౌకబారు ‘స్వాతి’తో సహా అన్ని పత్రికలకూ వర్తింపజెయ్యొచ్చేమోనన్న హడలుపుట్టింది. ఏడాదికి 24 డాలర్లు వెచ్చించి ఈ పత్రిక కొనడానికి కనీసం పదివేల మంది పాఠకులు లేక పత్రిక మూతపడాల్సివచ్చిందనేది ఒక సత్యం. అంటే పదికోట్లున్న తెలుగు జనాల్లో పత్రిక చదవడానికి నెలకు వందరూపాయలు ఖర్చుపెట్టే (సాహితీ) పోషకులు ఎవరూ లేరన్నమాట. చాలా విచారించదగ్గ విషయమే. కాకపోతే, “ఉటంకించిన గుణగణాలన్నీ అత్తెసరు ఆర్రూపాయల పత్రికల్లో దొరుకుతున్నప్పుడు, వందెందుకు పెట్టాలి?” అనేది నాలాంటి తలతిక్క పాఠకుడి ప్రశ్న.

నేను ఈ పత్రిక జీవితంలో ఒకసారికూడా చూడలేదు. చదవలేదు. కాబట్టి దాని గొప్పతనం నాకు తెలీదు. కానీ వింటుంటే మాత్రం ఏమీ గొప్పగా అనిపించడం లేదు. ఒక ముఖ్యమైన ప్రశ్నమాత్రం ఉదయిస్తోంది…..

పదికోట్ల మంది తెలుగోళ్ళలో పదివేల మంది పాఠకులు దొరక్కపోవడం ఎవరి తప్పు?

****

June 8, 2009

పెళ్ళెందుకు?

Filed under: సమాజం, సినిమాలు — kathimaheshkumar @ 1:52 pm

పెళ్ళెందుకు అని చుట్టుపక్కలున్న పదిమందిని అడిగితే పది సమాధానాలొస్తాయి. తాపీధర్మారావు గారు ‘పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు’ లో చెప్పినట్లు “చేతులారా మెడకు ఒక బండ కట్టుకోవడమే పెళ్ళి అంటాడు ఒకడు. కామభోగాలకు – ఇతరులకు ఎలాంటి హక్కులూ లేకుండా గుత్త తీసుకోవడమే అంటుంది ఒకర్తె. ఇష్టం ఉన్నా లేకపోయినా ఇల్లు గడుపుకోవడం అంటుంది ఒకర్తె. పగలంతా పరమ చాకిరీ,రాత్రంతా రాద్ధాంతం రణరణలు పెళ్ళి అంటాడు ఒకడు. ఇంటిపేరు నిలబెట్టుకోవడానికి ఇదొక సాధనం అంటాడొకడు. స్వర్గారోహణకు పెళ్ళి ఒక నిచ్చెన అంటాడొకడు. సాంప్రదాయం అంటుందొకర్తె. అదొక సందడి అంటుందొకర్తి…”

తాపీవారు వందసంవత్సరాల ముందు ఇలా చెప్పినా, ఇప్పుడు మరొకరు ఎవరైనా చెప్పినా, పెళ్ళి గురించ వేనోళ్ళ వేయి ఆభిప్రాయాలూ, పెళ్ళి చేసుకోవడానికి భిన్నమైన ఆశయాలూ, పెళ్ళంటే విపరీతమైన ఆలోచనలు.

యండమూరి ఏదో నవల్లో చెప్పినట్లు “మగాడు సెక్స్ కోసం పెళ్ళిని అంగీకరిస్తే ఆడది సేఫ్టీ కోసం పెళ్ళిని ఒప్పుకొంటుంది” అనేది మరో ఆధునిక భాష్యం. మొత్తాని పెళ్ళి ఇలా అవసరాలు, అభిప్రాయాలూ, కోరికలూ, ఆశల మధ్య నిర్వచనాల్ని వెతుక్కుంటూ కాలం గడిపేస్తోంది. లోకభిన్న రుచి: అన్నట్టు ప్రతివాడికీ, ప్రతొకత్తెకీ పెళ్ళికి కావలసిన కారణాలు విభిన్నం. కానీ పెళిమాత్రం ఒక అత్యవసరం. తధ్యం. ఎంతైనా రంగీలా సినిమాలో అమీర్ ఖాన్ అన్నట్లు “లైఫ్ లో సెటిలవ్వాలికదా! “

ఇక్కడ విషయం పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరం అయితే పెద్దాయన తాపీధర్మారావు గారు ఆంత్రాపొలాజికల్ సాక్షాలతో సహా ఎప్పుడో తేల్చేశారు కాబట్టి నేను కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు. పెళ్ళి గురించి నా అభిప్రాయం రాయాలంటే అదొక మహాభారతం అవుతుంది. అంటే మొత్తం కథ తరువాత యుద్ధం మాత్రం గ్యారంటీ అన్నమాట. అందుకే ఆ విషయాల ప్రస్తావన దాటేద్ధాం.

మొత్తానికి ఈ పెళ్ళి గోలంతా ఇప్పుడెందుకు చెబుతున్నానంటే, ఈ మధ్య స్టార్ మూవీస్ లో ఒక ఇంగ్లీషు సినిమా చూస్తుంటే అనుకోకుండా ఒక జ్ఞానగుళిక పుటుక్కున తెరచించుకుని నా కళ్ళు తెరిపించింది. ప్రత్యేకంగా చెప్పఖ్ఖర లేదనుకుంటాను. ఆ జ్ఞాన గుళిక పెళ్ళనే మహత్తర కార్యం గురించే. ‘పెళ్ళెందుకు’ అని ఇప్పుడున్న పెళ్ళికాని యువతని అడిగితే తోడుకోసం, భాగస్వామి కోసం, ఆత్మబంధువు కోసం, ప్రేమ కోసం, అనుబంధం కోసం, ఆత్మీయత కోసం, ఆధారంకోసం అని ఎన్ని కథలైనా చెబుతారు. అవి నిజం కూడా కావచ్చుగాక, కానీ ఈ సినిమాలో చెప్పే కారణం వింటే కూసింత మతిపోయి “అబ్బా. నిజమే!” అనిపించే జ్ఞానోదయం ఖచ్చితంగా అవుతుంది.

Why people get married.

“We need a witness to our lives. There’s a billion people on the planet … I mean, what does any one life really mean? But in a marriage, you’re promising to care about everything. The good things, the bad things, the terrible things, the mundane things … all of it, all of the time, every day. You’re saying ‘Your life will not go unnoticed because I will notice it. Your life will not go un-witnessed because I will be your witness’.”

– Beverly Clark (Played by Susan Sarandon)

క్లార్క్ పాత్ర అంటుంది… “మనుషులు పెళ్ళి చేసుకోవడానికి కారణం జీవితాలకు ఒక సాక్ష్యం కావాలనుకోవడం. కొన్ని వేలకొట్ల మందుండే ఈ లోకంలో నిజంగా ఒక చిరుజీవితానికి అర్థం ఉందా? కానీ పెళ్ళిలో ఉంటుంది. ప్రతొక్క విషయానికీ ఒక గుర్తింపు ఉంటుంది. మంచైనా,చెడైనా, ఛడాలమైనదైనా, రోజువారీ బోరుకొట్టే విషయమైనా… ప్రతి క్షణం, ప్రతిరోజూ మన జీవితాన్ని తరచిచూడటానికి ఒక సాక్షి ఉంటుంది/ఉంటాడు. ప్రతి విషయం గుర్తింపబడుతుంది. జీవితం ఎవరూ గమనించకుండా ముగిసిపోదు. పెళ్ళిద్వారా మన జీవితానికి ఒక సాక్ష్యమివ్వడానికి సాక్షి లభిస్తుంది.”

పెళ్ళిద్వారా మన జీవితాన్ని గుర్తించే సాక్షం లభిస్తుంది అనేది ఎందుకో ఒక మహత్తరమైన కారణం అనిపించింది. ఏమో అందరికీ ఆ కారణం కావాలేమో ! అందుకే పెళ్ళికి ఇంత మహత్వం ఉందేమో!

*****

వ్యభిచారం : చట్టవ్యతిరేకం Vs అనైతికం

Filed under: సమాజం — kathimaheshkumar @ 8:03 am

కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకారం మన దేశంలో 2.8 మిలియన్ సెక్స్ వర్కర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 36% ఈ వృత్తిలోకి పద్దెనిమిది సంవత్సరాలు నిండకముందే ప్రవేశించారు (బహుశా బలవంతంగా ప్రవేశపెట్టబడ్డారు). కొన్ని స్వచ్చంధ సంస్థల లెక్కల ప్రకారం సెక్స్ వర్కర్ల సంఖ్య 15 మిలియన్లు. ఒక ముంబై నగరంలోనే లక్షమంది వరకూ సెక్స్ వర్కర్లు ఉన్నారని ఒక అంచనా.

1956 ఏర్పడిన The Immoral Traffic (Suppression) Act (SITA) చట్టం వ్యభిచారాన్ని చట్ట విరుద్ధం చేయకపోయినా, పబ్లిక్ స్థలాల్లో విటుల్ని ఆకర్షించకూడదనే క్లాజ్ ఆధారంగా పోలీసులు సెక్స్ వర్కర్లను వేధించడానికి ఉపయోగించుకుంటూ పరిస్థితుల్ని అత్యంత దయనీయమైన స్థితికి తీసుకువచ్చారు. చిత్రంగా ఈ చట్టంయొక్క ఉపనామం “సీత”. పోలీసులు పబ్లిక్ ఇండీసెన్సీ, పబ్లిక్ న్యూసెన్స్ లాంటి అర్థంకాని, చట్టప్రకారం నిర్వచింపలేని పదాల్ని ఉపయోగించి సెక్స్ వర్కర్లపై కేసులు బనాయించిన ఘటనలు కోకొల్లలు. ఈ నేపధ్యంలో చట్టాన్ని రక్షించేవారి చేతులనుంచీ రక్షణకల్పించమని సెక్స్ వర్కర్లు ఉద్యమాలు చేశారు. ఇక భారతదేశంలో పిల్లల్ని పడుపు వృత్తిలోకి దించే సమస్య అత్యంత విస్తృతం,అమానుషం. మన దేశంలోని 378 జిల్లాలలో మానవ ట్రాఫికింగ్, ముఖ్యంగా పిల్లల ట్రాఫికింగ్ ఏదో ఒక స్థాయిలో జరుగుతోందనే నిజం ఈ సమస్య విస్తృతత్వానికి నిదర్శనం.

ఈ పరిస్థితుల్లో HIV/AIDS వ్యాప్తి ప్రపంచం మొత్తాన్ని వణికించినట్లే భారతదేశాన్నీ పట్టిపీడిస్తోంది. ఈ వ్యాధి వ్యాప్తిలో సెక్స్ వర్కర్ల పాత్రను గుర్తించి Targeted Interventions (TIs) పేరుతో చాలా కార్యక్రమాల రూపకల్పన చెయ్యడం జరిగింది. వ్యాధి వ్యాప్తిలో వీరి పాత్రను వ్యాధి నిరోధక దిశగా మళ్ళించకపోతే అత్యంత ప్రమాదకారిగా మారుతుందన్న నిజాన్ని గ్రహించిన ప్రభుత్వం, సెక్స్ వర్కర్ల సమూహాలను సంఘటిత పరిచి లైంగిక విద్యద్వారా HIV/AIDS వ్యాప్తిని నిరోధించే కార్యక్రమాలను చేపట్టింది.

ఈ నేపధ్యంలో “మానవహక్కుల” ఆధారంగా ఉద్భవించిన డిమాండ్, ‘సెక్స్ వర్కర్ల హక్కుల రక్షణ’. ఈ ప్రతిపాదనను చాలా మంది వ్యభిచారానికి చట్టబద్ధత కల్పించడంగా అర్థం చేసుకోవడం అవగాహనాలేమి తప్ప మరొటి కాదు. భారతదేశంలో పడుపువృత్తి చట్టవ్యతిరేకం ఎప్పుడూ కాదు. Law actually “does not criminalise prostitution or prostitutes per se, but mostly punishes acts by third parties facilitating prostitution like brothel keeping, living off earnings and procuring, even where sex work is not coerced”. అంటే, ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నం ఉన్న చట్టాన్ని మరింత మానవీయం చెయ్యడానికి జరిగే యత్నమే తప్ప మరొటి కాదు. “Denial of equality of the rights and opportunities and of dignity and of the rights of equal protection against any discrimination of fallen women is violation of Universal Declaration under Article 7 and as well as Article 14 of Indian constitution” ఆధారంగా జరగనున్న ఒక corrective measure మాత్రమే. ఈ చట్టంలో ఉండబోయే మార్పల్లా “The emphasis IS NOT on the sex worker but the clients/pimps/brothel owners etc”. అంత మాత్రానికే ఇన్ని వాదప్రతివాదనలు తయారవడం చూస్తుంటే కొంత అశ్చర్యం మరికొంత బాధా కలుగుతోంది.

ఈ కొత్తచట్టం వలన వ్యభిచారం మరింత మెరుగ్గా రెగ్యులరైజ్ చెయ్యబడుతుంది. తద్వారా వ్యభిచారంలోకి బలవంతంగా నెట్టబడుతున్న వారి సంఖ్యతగ్గి హ్యూమన్ ట్రాఫికింగ్ వలయాలు చేధింపబడతాయి. ముఖ్యంగా పిల్లలు వ్యభిచార వృత్తిలోకి రాకుండా కాపాడగలుగుతాము. సెక్స్ వర్కర్ల అమానుష జీవితాలు ఉద్ధరింపబడతాయి. ప్రత్యామ్న్యాయ జోవనోపాధుల సృష్టిద్వారా గౌరవప్రదమైన జీవితాల్ని జీవించడానికి బయటికొచ్చేవారి సంఖ్య పెరుగుతుంది. HIV/AIDS వ్యాప్తిని నిరోధించే అవకాశాలు మెరుగుపడి ప్రజారోగ్యంపై అనుకూల ప్రభావం పడుతుంది.

వ్యభిచారాన్ని హఠాత్తుగా (సమూలంగా) రూపుమాపాలనుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఆచరణయోగ్యంకాని ఆదర్శం. ప్రపంచంలో ఏ దేశమూ వ్యభిచారాన్ని సమూలంగా రూపుమాపిన దాఖలాలు అసలు లేవు. అయినా సరే, ఈ మహత్తర ఆదర్శాన్ని పూరించాలంటే మొదటగా ప్రస్తుతం ఉన్న సమస్యలకు సమాధానాలు వెతకాలి. ఆ దిశగా ప్రతిపాదిత చట్టం ఒక ముందడుగు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా, చట్టపరమైన, మానవహక్కుల పరమైన కోణాల్ని విస్మరించి కేవలం “నైతికత” కోణంలోంచీ ఈ సమస్యను చూడటం అర్థరహితం. పైగా ఈ “చట్టబద్ధత” కుటుంబ విలువలకు గొడ్డలిపెట్టుగా వర్ణించబూనటం అసమంజసం.

ఈ మొత్తం వ్యాసంలోకూడా మేల్ ప్రాస్టిట్యూషన్ – మగ పడుపువృత్తిని గురించి ప్రస్తావించకపోవడం మన భారతీయ పురుషాహంకార సెక్సిస్ట్ నేచర్ కి ఉదాహరణేమో!

*****

June 4, 2009

‘దళిత మహిళ’ అనే క్వాలిఫికేషన్ ఉంటే సరా!

Filed under: సమాజం — kathimaheshkumar @ 6:21 am

మీరాకుమార్ ను స్పీకర్ గా ఎంపిక చేసిన మరుక్షణం, “‘దళిత మహిళ’ అనే క్వాలిఫికేషన్ ఉంటే సరా! సామర్ధ్యం అవసరం లేదా?” అనే ప్రశ్నలు మీడియాలో వినబడుతున్నాయి. ఇక్కడా మెరిట్ వర్సెస్ కోటా వాదనలు అర్జంటుగా ఊపందుకున్నాయి. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ “ఒక మహిళ, ఒక దళితమహిళ, దళితనేత జగజీవన్ రాం పుత్రిక లోక్ సభకు స్పీకర్ అవ్వడం” చారిత్రాత్మకం అని మీరాకుమార్ ను గురించి చెప్పడాన్ని సాకుగా తీసుకుని రంగులు పులిమి తిమ్మినిబమ్మిని చెయ్యడానికి చాలా ప్రయత్నాలు మొదలయ్యాయి.

ఒక మాజీ ఐ.ఎఫ్.ఎస్ అధికారిణి. ఐదుసార్లు విజయవంతంగా లోక్ సభకు ఎన్నికైన రాజకీయ నేత. వివధ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యురాలిగా చేసిన అనుభవజ్ఞురాలు. కేంద్ర క్యాబినెట్ లో మంత్రిగా చేసిన సామర్ధ్యం మీరాకుమార్ లో ఉండగా, ఇప్పుడు హఠాత్తుగా తన సామర్ధ్యం మీద ప్రశ్నలెందుకు ఉదయిస్తున్నాయో అన్నది చిదంబర రహస్యం. రాజకీయాలకు అతీతంగా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, వివిధ స్వచ్చంధ సేవా కార్యక్రమాలూ/ఉద్యమాలకు అధ్యక్షత వహించిన ఘనతకూడా మీరాకుమార్ కు ఉంది. 1967 లోవచ్చిన ఈ శతాబ్ధపు అత్యంత భయంకరమైన కరువు కాలంలో National Drought Relief Committee కి అధ్యక్షురాలిగా మీరాకుమార్ చేసిన సేవ అత్యంత ముదావహం. దళిత ఉద్యమంలో,మానవహకుల ఉద్యమంలో గత ఇరవై సంవత్సరాలుగా మీరాకుమార్ అందిస్తున్న సేవ అమోఘం. అంతేకాక రైఫిల్ షూటింగ్ లాంటి స్పోర్ట్స్ లో మెడల్స్ సాధించిన క్రీడాకారిణి మీరాకుమార్. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాకూడా తన సామర్ధ్యాన్ని శంకించడం అంతర్లీనంగా మీడియాలో పేరుకుపోయిన లింగ,కుల వివక్షకు సంకేతం కాక మరేమిటి?

భారత రాజకీయాలలో సామాజిక సింబాలిజం కున్న ప్రాముఖ్యత తెలియనిది కాదు. అంత మాత్రానా సామర్ధ్యలేమితో కాంప్రమైజ్ అవుతూ రాజ్యాంగపరమైన బాధ్యతలను అంటగడుతున్నారన్నది అత్యంత అసంబద్ధమైన వాదన. ముఖ్యంగా మీరాకుమార్ విషయంలో ఈ వాదన అత్యంత పేలవం. లోక్ సభ స్పీకర్లను తయారు చెయ్యడానికి ప్రత్యేకమైన స్కూలేదీ లేదు. ఎన్నికైన సభ్యుల నుంచే ఒక ఆమోదయోగ్యమైన సభ్యుడ్ని/సభ్యురాల్ని స్పీకర్ గా ఎన్నిక చేస్తారు. ఇప్పుడూ అదే జరిగింది. మీరా కుమార్ స్పీకర్ సీట్లో కూర్చుని ఒకరోజుకూడా కాలేదు. అప్పుడే “సామర్ధ్యం లేదు” అంటే ఎవరు నిరూపిస్తారు? ఎలా నిర్ధారిస్తారు?

సోమ్ నాధ్ చటర్జీ, బాలయోగి, సాంగ్మా అందరూ స్పీకర్లయ్యాకనే సభాపాలనతో తమ మార్కు ప్రత్యేకతను చాటారు. తమదైన సాంప్రదాయాలను నిలిపారు. ఇప్పటి వరకూ ఒక మహిళ స్పీకర్ అవలేదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. మీరాకుమార్ ఒక కొత్త ఒరవడిని తీసుకురాదని ఖచ్చితంగా ఎరైనా చెప్పగలరా? మరి ఈ స్పెక్యులేషన్స్ ఎందుకు? ఎందుకంటే ఒక మహిళ, ఒక దళిత మహిళ సామర్ధ్యం మీద ప్రశ్నలు రేపడం చాలా సులభం గనక. అలా చేస్తే ఒక తరగతి ప్రజలు సంతోషిస్తారు గనక. ఇందులో వివక్ష లేదు అంటే నమ్మేదెలా?

ఒకానొక ఛానెల్లో అయితే మరో మెట్టు దిగి మీరాకుమార్ సన్నని పీల గొంతు పెద్ద డిస్క్వాలిఫికేషన్ అన్నట్లుగా పదినిమిషాల కథనాన్ని వినిపించేశారు. లోక్ సభను అదుపులో పెట్టడానికి కంచుకఠం కావాలనీ, అది లేదు కాబట్టి మీరాకుమార్ తగదనీ తేల్చేశారు. బహుశా వీళ్ళకు స్పీకర్ బాధ్యతల గురించి కనీస పరిజ్ఞానం కూడా ఉన్నట్లు లేదు. మనం ‘లోక్ సభ టివి’లో చూసే ప్రొసీడింగ్స్ మాత్రమే స్పీకర్ పని కాదు. అంతకు మించిన రాజ్యాంగ బాధ్యతలు స్పీకర్ కున్నాయన్న ఎరుక కూడా లేకుండా మీరాకుమార్ సామర్ధ్యాన్ని శంకిస్తున్న ధోరణిని ఏమనాలి?

మహిళా రాష్ట్రపతి, మహిళా స్పీకర్, మహిళా యూపీఏ చైర్ పర్సన్, మహిళా ప్రతిపక్ష నేత (లోక్ సభ లో సుష్మాస్వరాజ్) ఉండగా మహిళా రిజర్వేషన్ బిల్ ఇప్పటికైనా పాస్ అవుతుందా అనే ఉపయోగకరమైన చర్చలు వదిలేసి ఇలాంటి వివక్షాపూర్వకమైన చర్చలతో మీడియా కాలయాపన చెయ్యటం కొత్త కాకపోయినా, (మరొక్కసారి) నిరాశాజనకం అనిమాత్రం చెప్పొచ్చు.

*****

June 1, 2009

ఆస్ట్రేలియా పై రెండు రాళ్ళు

Filed under: సమాజం — kathimaheshkumar @ 2:29 pm

ఆస్ట్రేలియాలో భారతీయులపై జరిగిన దాడుల్లో జాతివివక్ష ఒక ముఖ్యకారణమని, Indian high commissioner to Australia అన్నారు. కొన్ని వేల మంది విధ్యార్థులు గతవారం రోజులుగా తమపై జరుగుతున్న వివక్షపై పెద్దస్థాయిలో ధర్నాలు చేస్తున్నారు. వారిలో చాలా మంది ఆస్ట్రేలియా అత్యంత జాతివివక్షాపూరితమైన దేశంగా చెప్పుకొస్తున్నారు. ఈ మాటలు ఒకసారి టివి పెట్టి చూస్తే వినిపిస్తాయి, కనిపిస్తాయి. ప్రతి వార్తాపత్రికలోనూ కొన్ని వేలపెజీల కథనాలు చదవడానికి లభిస్తాయి.

ఇది “sweeping generalization” అని. ఆస్ట్రేలియా అంత దారుణమైన దేశం కానే కాదని. ఏదో కొందరు టీనేజర్స్ చేసినదానికి మొత్తం ఆస్ట్రేలియా దేశాన్ని జాతివివక్షాపూర్వకమైన దేశంగా చిత్రించడం అన్యాయమనీ కొందరు ఉదార భారతీయులు చెప్పుకొస్తున్నారు. నిజానిజాలు ఎలా ఉన్నా, భారతీయ మీడియాలో ఈ ఘటనలపై సర్వత్రా నిరసనలు తలెత్తినట్లు సమాచారం వెలువడుతోంది. ఈ ఘటనతో జాతి వివక్ష పెద్ద స్థాయిలో చర్చనీయాంశమైంది గానీ, నిజానికి ఆస్ట్రేలియాలో ఎన్నాళ్ళుగానో ఇలాంటి చెదురుమదురు ఘటనలు జరిగుతున్నాయని. అవి బయటికిరాకుండా అణగద్రొక్కబడ్డాయని కొందరి ఉవాచ.

ఈ నేపధ్యంలో బ్రిస్బన్, ఆస్ట్రేలియాలోని క్వీన్ లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, సినిమా రంగంలో అమితాబ్ సేవలకుగానూ ఇవ్వజూపిన గౌరవ డాక్టరేట్ ను అమితాబ్ బచ్చన్ గౌరవపూర్వకంగా తిరస్కరించి నిరసన తెలిపారు.అమితాబ్ తన బ్లాగులో ఈ విషయం వివరిస్తూ “I mean no disrespect to the Institution that honors me, but under the present circumstances, where citizens of my own country are subjected to such acts of inhuman horror, my conscience does not permit me to accept this decoration from a country that perpetrates such indignity to my fellow countrymen.” అన్నారు.

నేను ఆస్ట్రేలియా ఏప్పుడూ చూడలేదు. కేవలం కొన్ని సంవత్సరాలు ఆస్ట్రేలియన్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ లో పనిచేసాను. ఆ సందర్భంగా కొందరు ఆస్ట్రేలియన్ కంసల్టెన్ట్స్ తో మాత్రం పనిచెయ్యటం జరిగింది. వివక్ష అనే పెద్దమాట ఉపయోగించనుగానీ, భారతీయులంటే కొంత చిన్న చూపు మాత్రం వీరిలో ఖచ్చితంగా ఉంటుంది. బహుశా వారి తెల్లరంగు దృష్ట్యా వాళ్ళు “గొప్పోళ్ళు” అనే భావనకూడా చాలా మంది భారతీయుల్లో ఉంటుందనుకుంటాను. రెండూ వివక్షలే. ఈ విధంగా చూస్తే భారతీయులకన్నా racist మరొకళ్ళు లేరేమో! ఇక casteist, sexist అంటూ చాలా “ఇస్టు”ల్లో భారతీయులది ముందండుగే. అయినా, జరిగిన ఘటన తీవ్రత దృష్ట్యా వర్ణవివక్షతకు వ్యతిరేకంగా మాట్లాడకూడదా! ఇక్కడ కులం,మతం పేరుతో హింసాత్మక ఘటనలు జరుగుతాయి కాబట్టి అక్కడ భారతీయుల్ని కత్తితో పొడిచినా ఫరవాలేదా! అనేవి కొన్ని ప్రశ్నలు.

అమితాబ్ బచ్చన్ ను డాక్టరేట్ తిరగ్గొట్టినందుకు అభినందిస్తూ “భారతీయుల్ని అవమానించే దేశం ఇచ్చే గౌరవం తనకు అఖ్ఖరలేదన్న అమితాబ్ కు గౌరవాభినందనాలు తెలియజేస్తోంది.” అని నేను నవతరంగంలో రాస్తే కొందరు నొచ్చుకున్నారు. దానికి సమాధానం వెతుకుతుంటే నాకొక conspiracy theory తోచింది. భారతీయ నటుడైన అమితాబ్ బచ్చన్ కు ఒక విదేశీ యూనివర్సిటీ డాక్టరేట్ ఎందుకివ్వాలి? భారతీయ మీడియా ఒకవేళ కొందరన్నట్లు ఈ సమస్యను blowing out of proportion చేస్తుంటే…అదెందుకు?

ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియా సగటున 30,000 మంది విద్యార్థులు పైచదువుల కోసం వెళ్తుంటారు. అదీ లక్షల రూపాయలు ఫీజుల రూపంలో ఖర్చుపెట్టి. ఇక అక్కడికి వెళ్ళి పెట్టే ఖర్చులు, ఆస్ట్రేలియన్ ఎకానమీకి మనోళ్ళు చేసే సేవలు ఏదోఒక స్థాయిలో ఆ దేశానికి “లాభం” చేకూరుస్తూనే ఉన్నాయి. ఈ ఎకనామిక్ బంధాన్ని బలపరుచుకుని, మరింత మంది భారతీయ విద్యార్థుల్ని ఆకర్షించే మార్కెటింగ్ కోసం తప్ప అమితాబ్ కు డాక్టరేట్ ఇవ్వడం ద్వారా ఆస్ట్రేలియా యూనివర్సిటీ కి మరో కారణం ఏమీ లేదనే అనిపిస్తోంది. అదిప్పుడు బెడిసికొట్టింది. ఈ హింసాత్మక ఘటనతో ఆస్ట్రేలియా వెళ్ళే విద్యార్థులు కనీసం 10% తగ్గుతారని అంచనా. ఈ చిచ్చు ఇంకొన్నాళ్ళు రగిలితే ఆ శాతం మరింతగా పెరగొచ్చు.

ఇక రెండో కుట్ర. ఇంత పెద్ధ స్థాయిలో విద్యార్థులు విదేశాలలో పైచదువుల కోసం డబ్బు తగలెయ్యడం భారతదేశానికి ఏ విధంగానూ లాభదాయకం కాదు. అర్జున్ సింగ్ HRD మంత్రిగా ఉన్నప్పుడు ఉన్నత విద్యను ప్రైవేటీకరించడానికి బద్ధవ్యతిరేకిగా నిలచారు. కానీ ఇప్పుడు కపిల్ సిబ్బల్ మంత్రయ్యాక మార్గం సుగమం అని పరిశ్రమ వర్గాలు చెప్పుకున్నాయి. ఇప్పటి ఆస్ట్రేలియన్ మంటకు మరింత మీడియా గాలి తోలితే ఈ సాకు చూపి ప్రైవెటీకరణను త్వరితగతం చెయ్యొచ్చు. ప్రజల ఆమోదంకూడా ఫట్టుమని దొరికేస్తుంది.

మొన్న ఆస్ట్రేలియాలో జరిగిన పెద్దస్థాయి విద్యార్థుల ధర్నాలో కొందరు బిల్డింగులపై రాళ్ళురువారట. ఎంతైనా మనోళ్ళుమనోళ్ళే కదా! ఆ రాళ్ళతోపాటూ ఆస్ట్రేలియా పై నావి రెండురాళ్ళు. లెక్కేసుకోండి.

*****

May 27, 2009

దళిత లిబరలిజం

Filed under: సమాజం — kathimaheshkumar @ 9:58 am

లోక్ సభ ఎన్నికల్లో మాయావతి ఉత్తరప్రదేశ్ లో ఓటమి చవిచూసింది. ఓటు శాతం తగ్గకపోయినా సీట్లు మాత్రం పోయాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో దళిత-బ్రాహ్మణ కాంబినేషన్ కు నాంది పలికి ఒక కొత్త సమీకరణాన్ని సాధించినా ఆ మార్గం ఈ సారి ఫలితాల్ని ఇవ్వలేదు.

నిరసనవాద అస్తిత్వవాద దళిత గుర్తింపుతో భారత రాజకీయాల్లో ఒక దుమారం రేపింది మాయావతి. దళితులకు ఆధిపత్యం వహిస్తూనే ఉత్తరప్రదేశ్ లో భౌగోళికంగా, సామాజికంగా దళితులతో మమేకమైన ముస్లింల ఓట్లను సమాజ్ వాదీ పార్టీ నుంచీ లాక్కోవడంలో సఫలమయ్యింది. క్రితం ఎన్నికల్లో యాదవుల,ఠాకూర్ల రాజ్యంలో రాజకీయ గుర్తింపు కోసం ప్రాకులాడుతున్న బ్రాహ్మణులతో జట్టుకట్టి దళిత అస్తిత్వాన్ని మించిన రాజకీయపుటెత్తుగడ వేసి అధికారం కైవశం చేసుకుంది. దళిత బహుజన రాజ్యం ఒక్క దళితులవల్ల రాదనే పాఠాన్ని వంటబట్టించుకుందన్న తరుణంలో ఈ ఓటమి ఒక పునరాలోచనకు పిలుపు.

ప్రముఖ దళిత సిద్ధాంతకర్త చంద్రభాన్ ప్రసాద్ “మాయావతి తన ఇమేజ్ ని పునర్నిర్వచించుకోవాలి” అంటాడు. ముఖ్యంగా దళితులు తమ అస్తిత్వాన్ని కొల్పోకుండా ఇతర కులాల్ని కలుపుకుని సమానత్వం దిశగా, రాజ్యాధికారం దిశగా ప్రయాణించే “దళిత లిబరలిజం” మాయావతి లక్ష్యం కావాలని గుర్తుచేస్తున్నాడు. మాయావతికి “నేను దళిత స్త్రీని” అని చెప్పాల్సిన అవసరం ఇప్పుడు లేదు. తన పోరాటం “దళిత అణచివేతకు వ్యతిరేకంగా” అని ఎలుగెత్తిచాటాల్సిన అవసరం అసలు లేదు. తరాలుగా దళితకులాల్ని వంచించిన అగ్రకులాలపై నిప్పులు చెరగాల్సిన rhetoric అప్రస్తుతం. ఇవన్నీ తెలిసిన విషయాలే. కాబట్టి ఈ తరహా రాజనీతికి విలువ లేదు. అందుకే, మాయావతి ఉద్దేశం అన్ని కులాల,వర్గాల ప్రజలకూ నేతృత్వం వహించే ఒక దళిత మహిళగా ఎదగడమే కావాలి. దళిత లిబరలిజం సిద్ధాంతమే పునాదిగా ఈ ప్రయాణం జరగాలి.

****

May 25, 2009

యువత – ప్రేమ నిర్వచనం

Filed under: సమాజం — kathimaheshkumar @ 8:08 am

ఈ కాలం యువత ప్రేమ నిర్వచనం చాలా సింపుల్, “ప్రేమంటే… ఒక వయసుకొచ్చాక మానసిక, శారీరక అవసరాలు తీర్చుకోవడానికి ఆపోజిట్ సెక్స్ ‘తోడు’ కోరుకోవడం” అంతే.

ఈ నిర్వచనంలో కేవలం వ్యక్తిగత భావనలు తప్ప సాంఘిక విలువలు, సామాజిక ఆదర్శాలూ కనపడవు. సమాజం అందించిన విలువల ఆధారంగా జీవితాన్ని గడుపుతున్న చాలా మందికి ఇది అంగీకారాత్మకం కాకపోవచ్చు. ఎందుకంటే, మనం ఒక పద్దతిప్రకారం ఆల్రెడీ నిర్వచింపబడిన (Well Defined) మూసలో పెరిగి, ఆ విలువల్ని జీర్ణించుకుని, పరిపూర్ణులుగా వ్యక్తిత్వాన్ని సంతరించుకుని ఏర్పడిపోయాం. కొత్త విలువలు లేక మనవి కాని విలువల్ని మన వ్యవస్థ (system) అసంకల్పితంగా రిజెక్టన్నా చేస్తుంది లేక నెగటివ్ గా రియాక్టన్నా అవుతుంది. కానీ చాలా వేగంగా మారుతున్న ఈ విలువల్ని అర్థం చేసుకోలేని సంధియుగం లో ఉన్న మనం వాటిని అందిపుచ్చుకోకపోయినా, కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నింఛాల్సిన అవసరం చాలా ఉంది.

లేకపోతే ‘ఫ్యూచర్ షాక్’ కోసం సిద్దంగా ఉండాల్సిందే. మొన్న ఒక స్నేహితురాలు నాతో చర్చిస్తూ ఒక మాటంది, “కులాంతర వివాహాలను అంగీకరిస్తూ మనం ‘మనసులు విశాలం’ చేసుకునే లోఫు, ఏ అమెరికా పిల్లనో చూపించి ఖండాంతర వివాహానికో, లేక అసలు అమ్మాయేకాక ఒక అబ్బాయితో స్వలింగ వివాహానికో తయారౌతున్న జనరేషన్ ఇది” అని. ఇంత ప్రళయం మన గుమ్మం ముందుకు రాక మునుపే, కనీసం మారుతున్న నిర్వచనాల్ని తెలుసుకుంటే అవి ‘షాక్ అబ్జార్బర్లు’ గా ఉపయోగపడుతాయి.

*****

May 21, 2009

ఆరోగ్యశ్రీ : పాజిటివ్ ప్రైవెటైజేషన్ ?!?

Filed under: సమాజం — kathimaheshkumar @ 6:43 am

“ప్రజలకు కావలసిన అత్యుత్తమ స్థాయి వైద్యం పైసా ఖర్చులేకుండా జరుగుతుంటే ఆరోగ్యశ్రీ అన్యాయం అంటావేమిటి?” అని ఒక మిత్రుడు రాజశేఖర్ రెడ్డి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ అడిగారు. నిజమే! ఒకవైపు నాణ్యమైన సేవల్ని, సౌకర్యాల్ని ఇవ్వలేని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలు కష్టాలు పడే బాధ తప్పింది. అందరి ద్రాక్షల్లాంటి కార్పొరేట్ వైద్యం తీగందించి పేదోళ్ళ నోట్లో తియ్యటి ద్రాక్షల్ని నింపుతోంది. పైసా ఖర్చు లేకుండా పేదోడికి ఉత్తమప్రమాణాలున్న వైద్యం ప్రాణాలు కాపాడుతోంది. మరి ఇందులో సమస్యేమిటి?

సమస్య లేదనుకోవడమే ఇక్కడ సమస్య. వైద్యరంగంసంస్కరణల నేపధ్యంలో అరోగ్యశ్రీ ఒక aberration. ప్రభుత్వ వైద్యవ్యవస్థను బాగుపరచాలనుకునే ఆశయాలకొక గొడ్డలిపెట్టు. ఇప్పటికే దాదాపు 80% ప్రైవేటు రంగంలో ఉన్న వైద్యసేవల్ని పూర్తిస్థాయిలో ప్రైవేటు పరం చేసి, ప్రైవేటు సంస్థలకు సిల్వర్ ప్లేట్లో వందశాంతాన్ని అందజేసే కుట్రలో భాగం. కానీ ఇదొక ప్రజాదరణ పొందిన కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ నమూనాను మరిన్ని రాష్ట్రాలు త్వరలో అమలు చెయ్యడానికి పూనుకొన్నంతటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. అందుకే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలీక “పాజిటివ్ ప్రైవెటైజేషన్” అనాల్సొచ్చింది.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆసుపత్రుల్లో మెరుగైన సేవలకోసం నామమాత్రపు యూజర్ ఛార్జిలు పెడితే, ఆ చర్యను ప్రైవెటైజేషన్ పేరుతో పీకిపాతరేసిన వై.ఎస్.ఆర్ కొనసాగిస్తున్న ఈ పరోక్ష ప్రైవెటైజేషన్ మాత్రం విన్నూత్నమవడం విచిత్రమే. ఈ కార్యక్రమం ప్రజాదరణ పొందడంలో ఆశ్చర్యం లేదుగానీ, ఈ రంగంలో స్థిరమైన పాజిటివ్ మార్పు కోరుకునే మేధావులూ, ప్లానర్లూ, వ్యూహకర్తలూ నిశ్శబ్ధం వహించడం మాత్రం షాకింగ్ గా ఉంది. ఈ నిశ్శబ్ధానికి వీరు చెప్పే సమాధానాలు self defeating గా ఉన్నాయన్న స్పృహకూడా లేకుండా కొందరు వివరణ ఇవ్వబూనడం మరింత హాస్యాస్పదం.

వీరు ముఖ్యంగా చెప్పేదేమిటంటే ప్రైవేటు రంగంలో ఉన్నన్ని సాంకేతిక సౌకర్యాలు,నిపుణత ప్రభుత్వరంగంలో రావాలంటే మరో 20 సంవత్సరాలు పడుతుంది. అది చాలా ఖర్చుతో కూడుకున్నపని. కాబట్టి ఇలాంటి సూపర్ స్పెషాలిటీ ఇప్పటికే ఉన్న ప్రైవేటు రంగానికి పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఇవ్వడం సమంజసం అనేది వీరి వాదన. ప్రస్తుతానికి ఈ విధానం బాగానే ఉంది. మరి వచ్చే 20 సంవత్సరాలలో ప్రభుత్వరంగ ఆసుత్రుల్ని సూపర్ స్పెషాలిటీ చెయ్యడానికి ప్రణాళిలున్నాయా? అని అడిగితే మాత్రం నీళ్ళునములుతారు. ఈ వివరాల్ని చెప్పిన పరిశోధనలు ఎవరు చేశారన్న ప్రశ్నకి మౌనమే సమాధానం.

అంటే అతిముఖ్యమైన ఖర్చుఎక్కువా ఆదాయం తక్కువైన ప్రాధమిక ఆరొగ్యసేవల్ని వ్యయప్రయాసలకోర్చి ప్రభుత్వరంగం నడుపుతుంది. డబ్బులు దండుకోవడానికి ‘హైకాస్ట్ హెల్త్’ సూపర్ స్పెషాలిటీ పేరుతో ప్రైవేటు రంగం పాలవ్వాలి. ఇప్పుడ్యు ఆరోగ్యశ్రీ పేరుతో ప్రభుత్వ ఆసుపత్రిలను బాగుపరచడానికి ఖర్చుపెట్టవలసిన డబ్బంతా ప్రైవేటువారికి తినిపిస్తుంది. భవిష్యత్తులో చేతులెత్తేసి, ప్రజల్ని ప్రైవేటు హాస్పిటళ్ళపరం చేస్తుంది. ఇదేగా మన గొప్ప సంస్కరణ!

నిజానికి పదిహేను సంవత్సరాల క్రితం పరిస్థితి చూస్తే ప్రభుత్వ బోధనా వైద్యశాలలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా పేరుగాంచాయి. కానీ ఒక పద్ధతి ప్రకారం డాక్టర్ల జీతాలు పెంచక, సరైన సౌకర్యాలు కల్పించకా ప్రైవేటురంగం వైపుగా పంపించారు. ఇప్పుడు అదే expertise తక్కువయ్యిందనే కారణం చూపి రోగుల్నీ అక్కడికే పంపుతున్నారు. అదీ డబ్బులిచ్చి మరీ. ఆంటే పద్ధతి ప్రకారం ప్రభుత్వరంగాన్ని పనికిరాకుండా చేసి ప్రైవేటుకు ధారాదత్తం చెయ్యడమేగా లక్ష్యం.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రభుత్వం వైద్యంపై పెట్టే ఖర్చుకన్నా, ప్రజలు తమ ఆరోగ్యంపై పెట్టుకునే ఖర్చు ఎక్కువ. భారతదేశంలోనూ అదే పరిస్థితి. మారుమూల పల్లెలనుంచీ పట్నాలదాకా ఆర్.ఎం.పీ లకూ, ప్రైవేటు డాక్టరలకూ, వైద్యపరీక్షలకూ, మందూమాకుకూ సామాన్యప్రజలు పెట్టే ఖర్చు చూసుకుంటే ప్రభుత్వం పెట్టే ఖర్చుకన్నా కనీసం తొమ్మిది రెట్లు ఎక్కువుంటుంది. మన ప్రభుత్వాలు వైద్యరంగానికి కేటాయించే బడ్జెట్ GDP లో 0.9% దాటిన పాపాన ఎప్పుడూ పోలేదు. ఇప్పుడు టార్గెట్ 2-3% అంటున్నారు. కానీ ఇలా భవిష్యత్ ప్రణాళిలు లేని పబ్లిక్-ప్రైవేటు భాస్వామ్య కార్యక్రమాలు కొసాగిస్తే చివరికి మొత్తం ప్రభుత్వ ధనంకూడా ప్రైవేటువాళ్ళకిచ్చేసి వాళ్ళనే వైద్యరంగాన్ని నడపమనే పరిస్థితి రావచ్చు.

ఇక్కడ ప్రైవేటు రంగం వారి తెలివిని అభినందించాలి. వీళ్లు preventive and primary health care లోకి ఛస్తే అడుగుపెట్టరు. ఎందుకంటే అక్కడ కష్టమెక్కువ అమ్యామ్యా తక్కువ. పైగా 80% సాధారణ రొగాల్ని ఆస్థాయిలో అడ్డుకట్టవెయ్యగలిగితే వీరికి పనిలేకుండాపోతుందాయె. అంటే రోగాల్ని ఆపడంలో వీరికి అస్సలు ఆసక్తి లేదు. రోగాలుండి అవి పెచ్చరిల్లితేనే కదా వీరికి లాభాలు. వీరి ముఖ్యమైన పెట్టుబడల్లా ఆధునిక పరికరాలని దిగుమతి చేసుకుని “కొత్త వైద్యాన్ని కనిపెట్టి” ఖర్చుపెంచడం. ఒక గుండెకు సంబంధించి శస్త్రచికిత్సకు ఖర్చెంతవుతుందనే ఖచ్చితమైన అంచనాలు ఎవరైనా చెప్పగలరా? ప్రైవేటువారు ఎంత చెబితే అంత. ఈ ధరల్ని నిర్ణయించడంలోని శాస్త్రీయత ఎంత? దీనిపైన ఎవరి నియంత్రణైనా ఉందా? అనేవి ఎవరూ అడగని, అడగకూడని ప్రశ్నలు.

వైద్య,ఆరొగ్యరంగం మొత్తం భారతదేశంలోనే ఒక మాయాజాలంగా తయారయ్యింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు మంత్రులు, ముగ్గురు సెక్రెటరీలు,దాదాపు ఏడుమంది కమీషనర్లతో మాయను మించిన మహేంద్రజాలంగా తయారయ్యింది. ఈ పరిస్థితుల్లో సంస్థాత,వ్యవస్థాత సంస్కరణలు నిజంగా ప్రజలకు ఆరోగ్యాన్ని అందించేవిగా ఉంటాయా అనేది ఒకపెద్ద ప్రశ్న.

*****

May 18, 2009

హిందువులకు ‘జైహో’

Filed under: సమాజం — kathimaheshkumar @ 6:01 am

భయ్ హో! అంటూ ముందుకొచ్చిన అతివాద,మతవాద,హిందుత్వవాదాల్ని ఈ ఎన్నికల్లో హిందువులు మట్టికరిపించారు. ఎమ్.జె.అక్బర్ తన ఎడిటోరియల్ లో చెప్పినట్లు “India is not a secular nation because Indian Muslims want it to be secular. India is a secular nation because Indian Hindus want it to be secular.” అనేది జాతీయరాజకీయాల్లో మరోసారి ఋజువయ్యింది.

భయం ప్రాతిపదిక మీద. ద్వేషం ఆధారంగా. అసహనాన్ని నూరిపోసే బీజేపీ రాజకీయాల్ని నిర్ధ్వందంగా హిందూ ప్రజలు తిరస్కరించారు. వైషమ్య రాజకీయాలకన్నా, కుహానాలౌకికవాదంగా హిందుత్వవాదులచే పిలువబడే కాంగ్రెస్ ఉదారవాద రాజకీయానికి పట్టంగట్టారు. సామాన్యప్రజల రోజువారీ సమస్యలతో సంబంధం లేని, రిచ్యువలిజం తప్ప రిలిజియమ్ జీవితాల్లో లేని ఇన్సెక్యూర్ మధ్యతరగతి హిందుత్వవాద ధోరణి ఒక మైనారిటీ వాదం అనే నిజం తేటతెల్లం అయ్యింది.

ముస్లింల జనాభా ఎన్ని రెట్లు వృద్ధి చెందినా, క్రైస్తవంలోకి ఎంత మంది వెళ్ళినా హిందువుల మెజారిటీకి ఈ దేశంలో వచ్చే ఢోకా ఏమీ లేదు అనే నిజం జనాలకి తెలిసొచ్చింది. పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లు తీవ్రవాద స్థావరాలైతే మనకొచ్చే ముప్పుకన్నా బీజేపీ మైనారిటీల్లో రేపే భయంవల్ల, హింసాకాండవల్ల ఏర్పడే తీవ్రవాదుల వల్లే మనదేశానికి ముప్పనే నిజం ఎరుకలోకి వచ్చింది. కాంగ్రెస్ మైనారిటీ,దళిత, గిరిజన విధానాలవల్ల హిందువులకు అన్యాయం జరిగిపోతోందనే బీజేపీ శుష్కవాదానికి తెరపడింది.

బీజేపీ పార్టీ రాజకీయ అస్తిత్వాన్నీ, నాయకత్వం యొక్క క్రెడిబిలిటీని, మూలతత్వమైన హిందుత్వాన్నీ ఈ ఎన్నికల ద్వారా ప్రశ్నార్థకం చేసి ఈ దేశ హిందువులు తమ భావవైశాల్యాన్ని నిరూపించారు. ప్రతి చిన్నాచితకా విషయానికీ మనోభావాలు దెబ్బతీసుకుని తమ నమ్మకాలు ఎద్దేవా చెయ్యబడుతున్నాయనే కుహానా మధ్యతరగతి హిందువులు ఒక అల్పబుద్దికలిగిన మైనారిటీగా నిరూపించబడింది. అందుకే చైతన్యవంతులైన మెజారిటీ హిందువులకు ఈ ఎన్నికల్లో జైహో!

****

May 12, 2009

బ్రాహ్మనికల్ ఆటిట్యూడ్ – రేరాజుకు కొన్ని సమాధానాలు

Filed under: సమాజం — kathimaheshkumar @ 6:08 am

రేరాజుగారు ‘బ్రాహ్మనికల్ ఆటిట్యూడ్’ అనే టపాకి సంబంధించిన చర్చల్లో నేను “బహుశా అది మన post vedic Hindu సంస్కృతి నుంచీ వారసత్వంగా వచ్చిన లక్షణం. దేవుడ్నీ, మతాన్నీ, సామాజిక నిర్మాణాన్నీ ఎవడూ ప్రశ్నించకుండా అన్నిటినీ “డెఫినిటివ్” చేసిపడేసారు. ఈ ధోరణికి ఆద్యులు బ్రాహ్మణులే అయినా, ఈ జాఢ్యం కులానికి అతీతంగా ఒక సామాజిక behaviour గా ఎప్పుడో మమేకం అయిపోయింది.” అని వివరిస్తే కొందరు దీన్నొక బ్రాహ్మణ ‘కుల’ ద్వేషంగానో లేక మరొక డెఫినిటివ్ స్వరంగానో పరిగణించడం జరిగింది. దానికి కొనసాగింపుగా “వేదకాలంనాటి హైందవానికీ అ తరువాత కాలంలో వచ్చిన వ్యవస్థీకృత హిందూమతానికీ చాలా తేడాలున్నాయి. ఉపనిషత్తుల్లో బ్రహ్మపదార్థమని చెప్పబడినది ప్రస్తుతం ఎక్కడుందో కాస్తవెతకండి! వ్రతాలు ఏ వేదాల్లో ఉన్నాయో కాస్త చూసిచెప్పండి! వేదకాలంలో చిల్లరదేవుడైన విష్టువు అత్యంత శక్తివంతుడైన దేవుడుగా ఎలా ఎదిగాడో కాస్త కనుక్కుని చెప్పండి! శివుడు త్రిమూర్తుల్లో ఒకడెప్పుడయ్యాడో కాస్త ఆరాతియ్యండి! కులవ్యవస్తా, వర్ణాశ్రమధర్మాలూ, పాపపుణ్యాలూ,స్వర్గనరకాలు ఎప్పుడు మన సంస్కృతిలోకి ప్రవేశించాయో కొంచెం తెలుసుకోండి! ఇవన్నీ ఒక వర్గం వారు తమ స్వార్థానికి తెచ్చిపెట్టిన లంపటాలు. వీటిని ప్రశ్నించకుండా “పవిత్రం” చేసిన ఘనత కూడా వీరిదే. వారెవరో కొత్తగా చెప్పాలంటారా?

వేదకాలంలో ఉన్న “నేతినేతి” సంస్కృతిని “ఇతిఇతి”గా మార్చిన ఘనత సామాజిక ఆధిపత్యాన్ని కాంక్షించిన సంస్కృతం తెలిసిన బ్రాహ్మణులదే. దీనికి చరిత్ర సాక్ష్యం.ఈ “ఇతిఇతి” నుంచీ బ్రాహ్మనికల్ ఆటిట్యూడ్ వచ్చిందని, అదొక సామాజిక ధోరణిగా మారిందని నా అంచనా. అదే నా నమ్మకం కూడాను. ఈ ఆలోచనకు ప్రత్యామ్న్యాయం లభించేవరకూ అదే నా “డెఫినిటివ్” అబిప్రాయం.” అని చెబితే, ఇందులోకూడా అర్థంకాని విషయాలు చాలా కనిపించాయి.

ఆ సందర్భంలో ‘dominant paradigm’ and ‘hegemony’ అనే రెండు పదాల్ని రేరాజుగారికిచ్చి, వీటి గురించి తెలుసుకొంటే బహుశా నా ధృక్కోణం మరింతగా తెలుస్తుంది అని చెప్పటం జరిగింది. అప్పుడు రేరాజు బీయింగ్ వాట్ హియీజ్, నన్నే ఒక టపారాసి పుణ్యంగట్టుకోమన్నారు. అందుకే ఈ ప్రయత్నం.

‘dominant paradigm’: ప్రచులిత విలువల సమాహారం – ‘hegemony’ : ఆధిపత్యం

ప్రతిసమయంలోనూ ప్రతి సమాజంలో కొన్ని నిర్థారిత విలువలు ప్రచులితమై ఉంటాయి. ఆ విలువలే ఆ సమాజాన్ని నిర్వచిస్తాయి, నాగరికత స్థాయిని నిర్థారిస్తాయి. ఈ విలువలు పూర్తిసమాజంలోని అన్నిపార్శ్వాలలోనూ ఒకటిగా ఉండకపోవచ్చు. ప్రతిపార్శ్వంలోనూ వివిధ స్థాయిల్లో కొన్ని నిర్ధిష్టమైన విలువలు ఏర్పడుతూ ఉంటాయి. అవి సాధారణమైన గాలివానలకు చెదరవు. ఈ విలువల్ని కూకటివేళ్ళతోసహా పెకిలించగలిగిన “మార్పు” వస్తేనే అవి సమూలంగా మారేదిశగా పయనిస్తాయి. ఇలాంటి సమూలమైన మార్పుల్ని “paradigm shift” అంటారు. చర్చ ఈ paradigm shift ది కాదు. చర్చ reinforcing the dominant paradigm అనే ప్రక్రియది.

ప్రచులితమైన విలువలవలన లాభం పొందుతున్న వర్గాలు ఎప్పుడూ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనే చూస్తారు. అది సహజం. ఈ ఆధిపత్య ధోరణిని hegemony అంటారు. వీటిల్లో ముఖ్యంగా cultural and social hegemony అనేవి బ్రాహ్మణభావజాలం (కులం కాదు) ద్వారా మన భారతీయ సమాజంలో, కొన్ని వర్గాల ఆధిపత్యానికి కొమ్ముకాసేవిధంగా అమలు జరపబడుతున్నాయి. ఈ ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడానికి cultural and social imperialism అనే ప్రక్రియ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఆదిమకాలం నాటి యుద్ధాలంతా ఘోరంగా ఉండవు. చాలా సున్నితంగా,సౌకుమార్యంగా,సాధికారంగా ఇతర సంస్కృతుల హననంగావించి, తమ ఆధిపత్యాన్ని చాటుతూ ఉంటారు. ఒక స్థాయికొచ్చేసరికీ ‘సంస్కృతి’ అంటే ఇదే! అనే స్థితికి ఈ hegemonic భావజాలం సమాజాన్ని తీసుకొస్తుంది.

ఈ ఆధిపత్యధోరణి ఒక కాలంలో కొన్ని వర్గాలవల్ల భారతదేశంలో అమలైతే, ఇప్పుడు మన స్థాయి పెరిగి అమెరికా వంటి దేశాల బారిన పడుతున్నాం. అంతేతేడా.

ఉదాహరణకు సంస్కృతి అనగానే మనకు గుర్తొచ్చే ప్రక్రియలేమిటి. నృత్యం, సంగీతం, ఆహార్యం. వీటిల్లో నాగరికమైనవి (అని అంటున్నవి) ఏవో ఒక సారి పరిశీలించండి. ఇవన్నీ ఎవరివి? పూర్తి జాతికి సంబంధించినవా? కేవలం కొన్నివర్గాలవారు “ఇదే సంస్కృతి” అని (మనకోసం) తీర్మానించడంవలన సంస్కృతిగా చలామణి అవుతున్నాయా?

ఇప్పుడు హెజిమొనీని సుస్థిరంచేసుకోవడంలో ఉపయోగికారి అయ్యే ‘reinforcing the dominant paradigm’ ప్రక్రియ గురించి ఆలోచిద్ధాం. ప్రస్తుతం అమలులోవున్న విలువలపై ఎవరైనా అభ్యంతరకరమైన ప్రశ్నలు లేవనెత్తితే లేదా బలీయమైన మార్పు రావాలి కోరుకుంటే, పురాతన కాలంలాగా వారిని వెలివెయ్యడం కుదరదుగనక, వారికి అదే విలువలలోని మరో పార్శ్వాన్ని కన్వీనియంట్ గా కరెక్టివ్ రూపంలో చూపి, “చూడు! విలువల్లో తప్పులేదు. అదిఅర్థం చేసుకుని అమలుచేసే మనుషుల్లోనే సమస్యంతా” అని మభ్యపెట్టి మూలాల్లో మార్పురాకుండా కాపాడుకుంటారు. అంటే అదొక చిన్న alteration అవుతుందేతప్ప “మార్పు” కాదన్నమాట.

ఉదాహరణకు కె.విశ్వనాధ్ సినిమాలన్నీ ఆ dominant paradigm ని reinforce చేసే సినిమాలే. నాకు బాగానచ్చిన సప్తపది తీసుకుంటే, ఆ కథాంశంలోని విలనూ హీరో రెండూ వేదాలే. ఇన్నివైరుధ్యమైన సంభవాలకు చోటునిచ్చిన “మార్మికమైన” వేదాల్ని త్యజించి “కొత్త విలువలు” సృష్టించాలని ఆ సినిమా వాదించదు. ఇప్పటి దాకా మనుషుల వలన తప్పుజరిగింది. “జ్ఞానం” వలన కాదు. ఇప్పుడు కొత్తగా ఆ జ్ఞానానికి భాష్యం చెబుతున్నాను కాబట్టి ఇంతవరకూ జరిగింది “తూచ్!” అని యాజులు చెప్పేస్తే, మనమంతా “ఆహా ఎంత గొప్పఆభ్యుదయ చిత్రం” అనుకుంటూ తలలూపుకొని అదే శాస్త్రాల్నీవేదాల్నీ నెత్తినెత్తుకుని ఊరేగుతాము. ఏమిటయ్యా అంటే, `ఏదో కొందరి స్వార్థంతో అజ్ఞానంతో “తప్పు” జరిగింది. అంతమాత్రానా మొత్తాన్నీ కాదనుకుంటామా? ఎంత ఉదాత్తమైన విలువలూ!’ అనుకుంటూ సంబరపడిపోతాము.

నా ఉద్దేశంలో బ్రాహ్మణికల్ ఆటిట్యూడ్ కూడా ఈ పరిణామక్రమంలో ఒక hegemonic ఉపకరణగా, dominant paradigm ని reinforce చేసేది మాత్రమే. Paradigm shift కోసం ఎవరు ప్రయత్నించినా ఈ శక్తులు తమ యుక్తులతో చేతనంగా, ఉపచేతనంగా క్రియాశీలకంగా అడ్డుతగుల్తూనే ఉంటాయి.

రేరాజు అడిగిన ఈ క్రింది మూడు ప్రశ్నలకూ సమాధానం పైన చెప్పబడిన “వ్యవస్థే”కారణం.

1.తెలుగు మీద జరుగుతున్న ఇంగ్లీషు “అణచివేత” గురించి – వేర్ డు వి స్టాండ్!?
2.తెలుగు సినిమా మీద జరుగుతున్న “అణచివేత” గురించి – వేర్ డు వి స్టాండ్!?
౩.భారత దేశం మీద జరుగుతున్న “అణచివేత” మీద – వేర్ డు వి స్టాండ్!?

ఈ వివరణ కొంత oversimplification అయినా, మూలభావనలకు విఘాతం కలిగించేవి కావు.

*****

Older Posts »

Theme: Banana Smoothie. Blog at WordPress.com.

Follow

Get every new post delivered to your Inbox.