పర్ణశాల

November 7, 2008

లైంగికత Vs నైతికత : ఒక జెండర్ ధృక్కోణం

Filed under: Uncategorized — kathimaheshkumar @ 8:57 am

లైంగికత ఒక శారీరక స్పందన. నైతికం ఒక సామాజిక కట్టుబాటు. మొదటిది సహజం. రెండవది సమాజనిర్మితం. లైంగికత హద్దులుదాటితే, సమాజంలోని నిర్ధిష్టత,ప్రామాణికత దెబ్బతింటాయన్న ఉద్దేశంతో, ఈ సహజత్వాన్ని హద్దుల్లో పెట్టడానికి నైతికత అనే కృత్రిమ కంచె ఏర్పాటు చెయ్యటం జరిగింది. కాకపోతే, ఇక్కడకూడా men are more equal than women అయిపోయారు. ఈ లింగవివక్షతోకూడిన నైతిక నిర్వచనాల స్థాపనలో, శారీరక గుణాలపాత్ర చాలా వుందని తెలుసుకోవడం ముఖ్యం. ఈ నిజాన్ని ఎంత విస్తృతంగా తెలుసుకుంటే, అంతే విశదంగా ‘నైతికతే మన సమాజంలోని లింగవివక్షకు మూలం’ అనే సత్యం గోచరిస్తుంది.

‘శారీరక కలయిక గర్భాదానానికే!’ అనేది మన శాస్త్రాలు చెప్పే విషయం.ఇలాంటి మాటలే దాదాపు అన్ని మతాల్లోనూ చెప్పడం జరిగింది. అది చాలావరకూ నిజం కూడాను. లైంగికతలోని మూల ఆశయం పునరుత్పత్తి (procreation). ప్రతిజీవీ తన సంతతిని వృద్ధిచేసుకుంటూ మనుగడ సాగించడం ఈ లైంగికత ద్వారానేసాధ్యం.అందుకే ఈ ప్రక్రియకి పవిత్రత ఆపాదించబడింది. ఆ పవిత్రత ఆధారంగా, కలయికకి సంబంధించిన కొన్ని నియమాలు సృష్టించబడ్డాయి. ఈ సందర్భంలో ఆడవారికీ మగవారికీ గల మౌళికమైన తేడాను గుర్తించడం అవసరం. మగవారు పవిత్రత మీరినా, నియమాల్ని వుల్లంఘించినా వాటికి ఆధారాలు లభ్యంకావు.కానీ, అదేపని ఆడది చేస్తేమాత్రం ఆక్షణంలో కాకపోయినా మరో కొన్నివారాలకి సమాజ ప్రామాణికతను దెబ్బతీసే ఆధారాలతొసహా పట్టుబడుతుంది.

‘దొరికితేనే దొంగలు’ అనేది మన సామాజిక న్యాయసిద్ధాంతం కాబట్టి, ఈ దొరకని దొంగలకి మినహయింపునిచ్చేసి, దొరికే దొంగల మీద ప్రత్యేకశ్రద్ధ పెట్టడం జరిగింది. మన పూర్వజులు బహుతెలివైనవారూ, మానవప్రవృత్తిని కూలంకషంగా అర్థం చేసుకున్నవారూ కనక, దొంగ చేతికే తాళాలిచ్చేసారు. ఆ తాళాలే “సుసంపన్నమయిన మన సంస్కృతీ సాంప్రదాయాలకు పట్టుగొమ్మలయిన స్త్రీమూర్తులు” అనే బాధ్యత. కుటుంబ గౌరవం, వంశప్రతిష్ట, సంస్కృతీ సాంప్రదాయాల తాళాలు ఈ విధంగా సమకూరినవే.

ఈ తాళాలను మోస్తూమోస్తూ అదేతమ జీవితాశయంగా బ్రతికెయ్యడం మొదలయ్యింది. సమయం మారింది. పరిస్థితి మారింది. ఆశయాలు మారాయి.ఆదర్శాలు మారాయి. కానీ, ఇవేమీ పట్టనట్టుగా మన నైతిక నిర్వచనం మాత్రం మారలేదు. తాళాలిచ్చిన దొంగలుకూడా, ‘నిజంగా ఇది మా బాధ్యతే కామోసు’ అన్న గౌరవప్రదమైనభ్రమలో జీవించడం కొనసాగించారు.లింగవివక్ష వేళ్ళూనుకుంది, నైతికతని లైంగికత, లైంగికతని నైతికతా విడదియ్యరాని సామాజిక పార్శ్వాలుగా వర్ధిల్లుతున్నాయి.

ఒకసారి సమాజం మతం నైతికతకు ఇచ్చే నిర్వచనాన్ని చూసి తరువాత ఆధునికయుగంలో జరిగిన మార్పుల నేపధ్యంలో వాటిని బేరీజు చేద్దాం.

1.కలయిక ఉద్దేశం గర్భధారణకాబట్టి అది అత్యంతపవిత్రమైన కార్యం.
2. ఆ పవిత్రకార్యం పెళ్ళితరువాతనే జరగాలి.
3. కలయికద్వారా సంభవించే సంతానానికి తల్లిదండ్రులిద్దరూ బాధ్యత వహించాలి.

ఆధునిక యుగంలో గర్భనిరోధకాలద్వారా గర్భధారణతో సంబంధం లేని కలయిక సంభవం,సాధారణం. కాబట్టి, కలయికకు ఆపాదించబడే పవిత్రతకు స్థానం లేదు. పెళ్ళి అనేది ఐచ్చికం (optional) కాబట్టి, పెళ్ళి కలయికకు అత్యవఅవసరమైన షరతు అసలు కాదు. ఇక్కడ పిల్లల ప్రసక్తి లేదుకాబట్టి బాధ్యతాయుతమైన కలయిక అంటే, ఈ కలయిక ద్వారా పిల్లలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం. ప్రస్తుతం ప్రాణాంతకమైన వ్యాధులు సంక్రమిస్తున్నాయి కాబట్టి అవి సంక్రమించకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవడం.

ఈ ఆధునిక మార్పుల నేపధ్యంలోంచీ చూస్తే, పైన చెప్పిన మూడు నిబంధనల్నీ ఇలా మార్చుకోవచ్చు.

1.కలయిక ఉద్దేశం చాలావరకూ ఆనందం. అప్పుడప్పుడూ మాత్రమే గర్భధారణ
2. పెళ్ళికీ కలయికకూ ఎటువంటి బాదరాయణ సంబంధం లేదు.
3. కలయిక ఇరు పక్షాల సమ్మతంతో, బాధ్యతాయుతంగా జరగాలి.

ఒకప్పుడు స్త్రీకి తన శరీరంపైన ఎటువంటి నియంత్రణా లేదుకాబట్టి, అప్పటి పరిస్థితికి అనుగుణంగా లైంగికతను నిర్దేశించే నైతికతను ఆపాదించడం జరిగింది. కానీ,మారిన నేపధ్యంలో కూడా అవే కొనసాగటం మాత్రం కొంత సామాజిక కుట్రలో భాగం అనిపించకమానదు.

అంతెందుకు, వ్యవస్థీకృత కలయిక జరిగే పెళ్ళిలో కూడా గర్భాధారణతోపాటూ, పెళ్ళి అనే సంబంధం ప్రేమతో కలకాలం కొనసాగే ప్రక్రియలో భాగంగా గర్భనిరోధక కలయికను ఆమోదిస్తున్నప్పుడు, దానికి ఇంకా procreation పవిత్రతను అంటగట్టడం అర్థరహితం. అలా చెయ్యటం లేదుకాబట్టి, ప్రేమించిన స్త్రీ ఆ ప్రేమకారణంగా సుముఖంగా గర్భందాల్చడానికి ఇష్టపడిందని అనుకోవాలి.అంటే, ఇక్కడ స్త్రీ ఇష్టానికిగల ప్రాధాన్యత ముఖ్యంగానీ పెళ్ళి అనే వ్యవస్థకున్న ప్రాముఖ్యత నగణ్యం. కారణం, పెళ్ళైనంతమాత్రానా భర్తతో బలవంతంగా కాపురం చెయ్యాలి లేక పిల్లల్ని కనివ్వాలన్నది చట్టరీత్యా నేరం కాబట్టి.

స్త్రీకి తన శరీరంపైన తనకుగల సంపూర్ణహక్కుల నేపధ్యంలో,ఆ హక్కుల్ని కాపాడుకునే సాంకేతిక జ్ఞానం మరియూ విజ్ఞానం యొక్క లభ్యత దృష్ట్యా పవిత్రతలూ, నైతికతలకు కాలం చెల్లిపోయిందనే సైద్ధాంతిక రూపేణే భావించాలి.కానీ, మన సమాజిక నిర్మాణం,వ్యవస్థా ఈ మార్పులకి అనుగుణంగా ప్రస్తుతానికైతే అగుపించడం లేదు. లైంగికతను శాసించే నైతికతలు పోయి, స్వతంత్ర్యంగా లైంగికతను ఒక వ్యక్తియొక్క ఆద్శావకాశం (informed choice)గా నిర్ణయించుకునే మార్పు వస్తుందని ఆశిద్దాం.

August 17, 2008

ఈ కాశ్మీరం నాకొద్దు !

Filed under: Uncategorized — kathimaheshkumar @ 8:15 am

పంద్రాగస్టు వేడుకల మధ్యన ఒక న్యూస్ ఛానల్లో కాశ్మీర్ లోజరుగుతున్న అమర్నాథ్ భూవివాదం గురించి చూపిస్తుంటే, ఆ విజువల్స్ నేపధ్యంలో ఎక్కడో ఒక పాకిస్తాన్ జెండా కనబడింది. ఒక్క క్షణం నాకు పిచ్చికోపమొచ్చింది. కానీ మరొక్క క్షణంలో, “ఏమిటి మనకీ ఖర్మ” అనిపించింది. ఈ ఒక్క ఘటనకాదు 1990 లనుంచీ అక్కడ ఏర్పడిన(నా కర్థమైన) పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుంటే, “మనకు నిజంగా ఇంత జంఝాటం అవసరమా?” అని అప్పుడప్పుడూ అనిపిస్తుంది.

ప్రస్తుతం కాశ్మీర్లో ఉన్న సమస్య అక్కడి ప్రభుత్వ చేతగానితనం, భారతప్రభుత్వ అలసత్వం, సంఘ్ పరివార్ రాజకీయ ఎత్తుగడే అయినా, అదక్కడ ఆగక ఒక అంతర్జాతీయ సమస్య రూపంలో మళ్ళీ కాశ్మీర్ ను నిలిపింది. ఇక ఈ అవకాశంకొసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పాకిస్తాన్ పండగ చేసుకుంటోంది. కాకపోతే, ఈ సంఘటను ఒక సాధారణ ఘటనగా పరిగణించక, దీన్ని అవకాశంగా చేసుకుని మన కాశ్మీర్ stratagey ని పునర్నిర్వచించడానికి ప్రయత్నించడం ఎంతైనా అవసరం. అది భారతదేశ భవిష్యత్తుకు చాలా కీలకం కూడా.

ఇలాంటి వేర్పాటువాద భావనలతో మనం ప్రజాస్వామికంగా ఇదివరకూ ‘డీల్’ చేసాముకూడా. కానీ కాశ్మీర్ రోజురోజుకీ ఇంకా సమస్యాత్మకంగా పరిగణిస్తోందేతప్ప సమస్య అంతమవటం లేదు. నాగాలాండ్, అస్సాం, మిజోరాం లాంటి రాష్ట్రాలు ఇదివరకూ విడిపడాలనే ప్రయత్నం చేసినా “సామ,దాన,భేధ, దండోపాయాలు” ఉపయోగించి విజయవంతంగా ఆ ఉద్యమాలను అంతం చేసాం. పంజాబ్ రాష్ట్రం కూడా ఖలిస్తాన్ కావాలని తీవ్రప్రయత్నం చేసి భారతదేశ విధానాలకు లొంగిపోవాల్సి వచ్చింది.

ఈ అన్ని ఉద్యమాలలో మనం ఉపయోగించిన విధానాన్ని మూడు వ్యూహాల్లో చెప్పాలంటే, 1) నిర్దాక్షిణ్యంగా హింసాత్మక వేర్పాటూవాదుల్ని అణగదొక్కడం. 2) సానుకూలంగాఉన్న వేర్పాటువాదుల్ని రాజకీయప్రక్రియలో భాగం చేసి ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం. 3) కేంద్రప్రభుత్వం అత్యధిక ఆర్థిక వనరులు సహాయం చేసి శాంతితోపాటూ ఆర్థికంగా ఆప్రదేశాన్ని పునర్నిర్మించడం. ఈ మూడు విధానాలనూ కాశ్మీర్ లో కూడా ప్రయోగించినా ఫలితం మాత్రం శూన్యం మిగిలింది.

ప్రస్తుతం అక్కడి వేర్పాటువాదులు కోరుతున్న కోరికల్లో అర్థం లేదు. భారతప్రభుత్వం చేస్తున్న పనుల్లో తర్కం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మన వ్యూహాలు దెబ్బతినడం సహజమేకదా! వేర్పాటువాదులు కాశ్మీర్ కు “అటానమీ” కావాలంటారు. 370 ఆర్టికల్ మూలంగా వాళ్ళకు సిద్దించిందంతా అటానమీనే…మరి ఇంకా ఏంకావాలో నాకైతే అస్సలర్థంకాదు. మన పార్లమెంటు పాస్ చేసిన చట్టాలుకూడా, వారు తమ రాష్ట్రంలో మళ్ళీ అంగీకరిస్తేతప్ప అమలుకావు. ప్రెసిడెంట్ తన అధికారాన్ని కాశ్మీర్ లో ఉపయోగించలేడు. కాశ్మీరీలు భారతీయులేగానీ, భారతీయులు మాత్రం కాశ్మీరీలు కాజాలరు. అక్కడ మనం ఆస్థినికూడా కొనలేంకదా! ఇంతకంటే అటానమీ కావాలా ఎవరికైనా?

ఇక ఆర్థిక సహాయం అంటారా…భారతప్రభుత్వం మిగతా రాష్ట్రాలకు అందించే తలసరి ఆర్థిక సహాయం 1000- 1500 రూపాయలుకాగా (అదీ చాలా వరకూ అప్పురూపంలో), కాశ్మీర్ లో ఇచ్చేదిమాత్రం దాదాపు 10,000 రూపాయలు. అంటే దాదాపు పదింతలెక్కువ. అదీ ఫ్రీగా. ఇదిపోనూ ఇక ప్రధానమంత్రి నిధి, ప్రత్యేక నిధి అని మరికొన్ని వందలకోట్లు ప్రతి ఏటా మన డబ్బు తీసుకెళ్ళి కాశ్మీర్ లో ‘మండిస్తున్నాం’. ఇక్కడ మనడబ్బు అని ఎందుకంటున్నానంటే, కాశ్మీర్ లో ట్యాక్స్ ద్వారా లేక వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం నగణ్యం.

ఇక మనం కాశ్మీరాన్ని బలవంతంగా మన భూభాగంలో ఉంచుకోవడానికి పెడుతున్న ఖర్చు కొన్ని వేలకోట్లు దాటుతుంది. పార్లమెంట్ దాడి తరువాత జరిగిన “ఆపరేషన్ పరాక్రం” కోసం భారతీయ ఆర్మీ(10 నెలలలొ) పెట్టిన ఖర్చు అక్షరాలా 6,500 కోట్లు…800 మంది సైనికుల ప్రాణాలు.

కాస్త ఎమోషన్ ని పక్కనపెడితే, ఇవన్నీ నిజంగా మనకవసరమా? “మేము భారతదేశంతో ఉండం మొర్రో” అటుంన్నవాళ్ళని బలవంతంగా పట్టి ఉంచడం, కేవలం “కాశ్మీర్ నుంచీ కన్యాకుమారివరకూ మాది ఒకేదేశం” అని చెప్పుకోవడానికి బాగుంటుందనేనా! అందుకే ఒక్కసారి “మీ ఖర్మ” అని కాశ్మీరాన్ని వదిలేస్తే ఎలావుంటుందా అనే ఆలోచన వస్తుంది.

కాశ్మీర్ ఒక ప్రత్యేకమైన దేశం అయితే ఆర్థిక వనరులు లేక క్షీణించి మళ్ళీ మన కాళ్ళ బేరానికి వస్తారు. సమస్య తీరిన తరువాత, భారతదేశాన్ని ఇరుకున పెట్టలేదు గనక అసలే అమెరికా దయాదాక్షిణ్యాలమీద బతుకుతున్న పాకిస్తాన్ పెద్ద సహాయం చెయ్యకపోవచ్చు. ఒకవేళ కాశ్మీర్ వెళ్ళి పాకిస్తాన్లో చేరితే, ఇప్పుడున్న ప్రజాస్వామ్యం, అంతగా కోరుకుంటున్న అటానమీ రెండూ పోయి ‘గతవైభవాన్ని’ తలుచుకుని ఏడవడం తప్ప చెయ్యగలిగిందేమీ ఉండదు. ఇంతా జరిగితే భారతదేశానికొచ్చే నష్టం, మనం ఏమోషనల్ గా నమ్ముతున్న “కాశ్మీర్ భారత్ లో ఒక భాగం” (నిజానికి మ్యాప్ లో చూసే కాశ్మీరం కూడా సగమే మనదగ్గరుంది) అన్న అపోహ మాత్రం ఛిన్నాభిన్నమవడం. రాజకీయనాయకుల ఉపన్యాసాలూ, ఉగ్గుపాలతో నేర్పిన దేశభక్తీ కొంచెం గింజుకుని కృశించడం.

తార్కికంగా మనకు జరిగేనష్టం పెద్దగా లేకపోగా, ఇంకా మనకు ఆర్థికంగా, మిలటారీ పరంగా చాలా లాభాలున్నాయి. కానీ మనలో బలంగా నాటుకుపోయిన “భావనలు” అలా చెయ్యనివ్వటం లేదు. దీనికి అంత త్వరగా సమాధానకూడా లేకపోవచ్చు. అయినా J&K లో జమ్మూ, లడాక్ లను తీసేస్తే (అక్కడ ఈ వేర్పాటువాదం లేదు. సాంస్కృతికంగా కూడా వీటికీ కాశ్మీర్ లోయకీ సంభంధం లేదు) కాశ్మీర్ లోయలో ఉన్న జనం మన విజయవాడ జనాభా అంతమంది మాత్రమే ఇక భూభాగం కనీసం గోవా రాష్ట్రమంత కూడా ఉండదేమో…కానీ దానికి మనం చెల్లిస్తున్న మూల్యం…ఇది మనకు నిజంగా అవసరమా?!?

అందుకే ఈ కాశ్మీరం నాకొద్దు…

****

*some of the statistics in above article are taken from ‘Vir Sangvi’ .

June 7, 2008

కర్ణాటక లో ఒక బౌద్ధ విహారం

Filed under: Uncategorized — kathimaheshkumar @ 9:30 am

ఈ మధ్య వేసవి శెలవుల్లో కర్ణాటకలోని కూర్గ్ లేక కొడగూ అనే జిల్లాలోని ‘మడికేరి’ హిల్ స్టేషన్ కు వెళ్ళడం జరిగింది. అక్కడి నుండీ దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో, ‘కుషాల్ నగర్’ మరియూ ‘బైలెకుప్పే’ ఊర్ల మధ్యనున్నఒక అందమైన బౌధ విహారం ఫోటోలు మీకోసం. ఈ విహారాన్ని “గోల్డెన్ టెంపుల్” గాకూడా వ్యవహరిస్తారు.
మడికేరి, మైసూరుకు 120 కి.మీ. దూరం. ఈ బౌద్ధవిహారం 30 కి.మీ ముందే వస్తుందిగనక దాదాపు 90 కి.మీ అనుకోవచ్చు. మైసూరు నుండీ ‘కుషాల్ నగర’ చేరాలంటే మంగుళూరు,మడికేరి కి వెళ్ళే ఏ బస్సునెక్కినా చేరుస్తాయి. 60-90 రూపాయలతో ఇక్కడికి చేరచ్చు. రోడ్డు బాగానే ఉంది గనక దాదాపు 2 గంటల ప్రయాణం మాత్రమె. కుషాల్ నగర్ నుండీ కేవలం 5-6 కి.మీ దూరమే ఈ గోల్డెన్ టెంపుల్. కాబట్టి అక్కడనుండీ ఆటోలు విరివిగా దొరుకుతాయి.అదీ కేవలం 40-60 రూపాయలు ఖర్చు చేస్తే చాలు.
———————————————–

May 12, 2008

ఆలోచనలు Vs/& భావాలు

Filed under: Uncategorized — kathimaheshkumar @ 9:43 am

ఈ రెండు రోజుల్లో కథల గురించి, వాటిని రాయడం గురించి కొంత చర్చ జరిగింది. నేను కూడా కథ రాయటం లోని మానసిక శ్రమని, తెలియనితనాన్నీ కొంత అనుభవించాను (మొదటి కథ ని కూడా ‘డెలివరీ’ చేశేసా). నా మిత్రుడి ప్రోద్బలంతో ఈ సాహసం చేసినా, కథకుడికి కావలసిన భావవ్యక్తీకరణ బహుశా నాకు లేవని, కేవలం వ్యాసకర్తగా మాత్రమే ఉండగలనని సదా నమ్మినవాడ్నినేను. ఈ నా నమ్మకం నాకు కలిగిన తంతు గురించి కాస్త ఆలోచించా,దాన్ని ఇక్కడ పంచుకుందామని రాస్తున్నా.

“సమస్య గురించి చింతించడం కన్నా,ఆలోచించడం మిన్న” అని చిన్నప్పుడు ఎక్కడో చదివా. దీని అర్థమేమంటే, సమస్య గురించి చింతిస్తూ అంతర్ముఖుడై బాధపడటం కన్నా, సమస్య తీరే తీరును ‘లాజికల్ డిడక్షన్’ పద్ధతిలో ఆలోచించి దాన్నుండీ బయటపడటం. ఈ సలహా ప్రభావం నాపై చాలా ఉండేది. టీనేజి వయసుకొచ్చేసరికి ఆ వయసు సమస్యలకి (ఈ వయసులో సమస్యలేముంటాయి? అనేవారు యవ్వనాన్ని అనుభవించలేదని అర్థం) ఇలా ఆలోచించి సమాధానం రాబట్టి, (వేరే దారి లేక) సముదాయించేసుకునే వాడిని. ఈ ఆలోచనలు ఎలా ఉండేవంటే, ” ఆ అమ్మాయి బాగుంది, ప్రేమించాలి” అన్న భావన కలిగిన వెంఠనే నా ‘లాజిక్’ పనిచేసేది. ” ఆ…బాగుంటే మాత్రం ఏమిటి, మాట్లాడటం ఎలాగూ కుదరదు కదా! ఒకవేళ మాట్లాడినా, పెన్ అడగడంతప్ప అంతకుమించి మాట్లాడే అవకాశం రాదుకదా! ఒకవేళ మాట్లాడినా మన దగ్గర ఇంప్రెస్ చెయ్యదగ్గ గొప్ప విషయాలు ఏమున్నాయ్! ఉన్నా తను ప్రేమిస్తుందా! ఇవన్నీ జరిగే విషయాలు కావు గనక, చాప్టర్ మూసెయ్” అని ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలొ ధుర్యోధనుడి డయలాగుల్లా మెదడులో మోగేవి. అంటే, భావాల్ని ఆలోచనలతో సముదాయించి జోకొ్ట్టేవన్న మాట. ఈ జోకొట్టడం కాస్తా వయసుతో పాటూ పెరిగి, కొంత భాషని కూడా దాంట్లో కలుపుకొని రాటుదేలిపోయాయి.

ఈ క్రమంగా నా జీవితంలోని ప్రతి వెధవ విషయాన్నీ అనుభవించక, ఆలోచించి దాని అంతుచూడడం అలవాటుగా ఏర్పడిపోయింది. అందుకే నేను అనుభవాల్ని పంచుకోవాలన్నా, నా ఆలోచనలే అక్షర రూపం దాలుస్తాయిగానీ భావాలు దొర్లిపడవు. అంటే నేను మరీ బండరాతినో, ఫీలింగులేని పిపీలకాన్నో అనికాదు. కేవలం భావవ్యక్తీకరణ విషయం లో సరైన భాష లేని వికలాంగుడిని మాత్రమే. ఉదాహరణకు ఒక వేళ ప్రేమిస్తే ఎందుకు ప్రేమించానో చెప్పగలనుగానీ, ప్రేమని వ్యక్తపరచాలంటే మాత్రం కోంచం కష్టమన్నమాట.
నా లాంటి భావవ్యక్తీకరణా వైకల్యం చాలా మందిలో ఉండొచ్చేమో!

ముఖ్యంగా చెప్పదల్చుకున్నది ఏంటంటే, కవితలూ కథలు రాశేవారు బహుశా తమ ‘విషయాలని’ మనసులోంచి తీస్తే నాలాంటి (వ్యాసాలు,సమీక్షలు రాశే) వారు మెదడులోంచి తీస్తారు అని. ఇక్కడ ఏది గొప్ప అని ఎవరైనా అడిగితే, మనసే అని చెబుతాను. ఎందుకటే, ఆలోచనని తెలియజెప్పడం కన్నా, హృదయాన్ని ఆవిష్కరించడానికి భావాలు తెలియజెప్పే భాషతో పాటు అనుభవించే మనసూ కావాలి. అది మనకు కొంచం తక్కువన్నమాట.

ఏదిఏమైనా ఈ రెండురకాల రచనలూ హాయిగా కో-ఎగ్జిస్ట్ అవ్వచ్చన్నమాట. కానీ ఒక్కటి మాత్రం ముఖ్యం, ఈ రెండు విధాలూ మనిషికి అల్టిమేట్ గా ఆనందాన్నిస్తేనే సార్థకం. లేకుంటే వ్యర్థం.

May 11, 2008

నా మొదటి కథ, మొదలెట్టా !!!

Filed under: Uncategorized — kathimaheshkumar @ 8:43 am

జీవితం లో నేను రాస్తున్న మొదటి కథ ఇది. వ్యాసంగం అప్పుడప్పుడూ వెలగబెడుతున్నా, కథలు రాశే ధైర్యాన్ని ఎప్పుడూ తెచ్చుకోలేదు. ఎందుకంటారా? వ్యాసం లో ఐతే మనం చెప్పాలనుకుంది చెప్పేసి, తూచ్! అనేసుకోవచ్చు. కానీ కథల్లో అలాకాదు. పాత్రలను సృష్టించాలి, వాటికి ప్రాణప్రతిష్ట చెయ్యాలి,ఆలోచనల్ని నింపాలి కథను నడిపించాలి. అంతా చేసిన తరువాత ఒక్కోసారి సృష్టించిన పాత్రలు “నువ్వు మమ్మల్ని నడపడమేమిటి?”అని, తమ కథ తామే నడిపించేసి, కథకుణ్ణి ఇబ్బంది పెట్టేస్తాయి. ఇంత లావుశ్రమ మనకెందుకులే అని నేను సర్దుకు పోతున్నా, అరవింద్ అనే నా మిత్రుడు తేరగా ఇంటర్ నెట్ దొరకబుచ్చుకుని (సాప్ట్ వేర్ ఉద్యోగం వెలగబెడుతున్నాడు లెండి!) గూగుల్ టాక్ లో నన్ను కథ రాశెయ్యమని తెగ పోరేస్తున్నాడు. ఆన్లైన్ లో గ్రీన్ లైటు కనపడితే, వీడేనేమో అని ఒక్కటే దడ.

ఈ ‘దడ’బిడ తప్పించుకుందామని, కథ రాశేద్దాంలే! అనుకున్నా. కానీ ఈ మధ్య నేను చదివిన బ్లాగుల్ళొని కథలు గుర్తొచ్చి, మరింతగా గుండె ఠారెత్తింది. ఏమి కథలు, ఏమి విషయం,ఏమి శైలి. నా సామిరంగా ! పత్రికలూ,పబ్లిషింగూ వదిలి, గుడెలుతీసిన కథా పోటుగాళ్ళూ,పోటుగత్తెలూ దండుగా తెలుగు బ్లాగులమీద దండెత్తినట్టుగా ఉంది కత. ఈ మహాయుద్ధం లో వంటకత్తెట్టుకుని “నేనూ సైనికుడినే, కథా కదనరంగానికి వారసుడినే!” అనడం ఎట్టా? అని నాలోనేను ఆత్మారాముడితో డిస్కషన్ లో ఉంటే, అదే మిత్రుడు, మరో సలహా పారేశాడు. అదేమిటయ్యా అంటే, “నీ అభిప్రాయాలనే కథా పాత్రలుగా మార్చి, కథ రాశెయ్యీ” అని. కానీ, ఇలా రాస్తే అది ఒక చర్చా పత్రమవుతుందే గాని, కథ అవుతుందా? అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. ఇంతా ఆలోచించే బదులు, రాయడం మెదలెడితే విషయం తేలిపోతుందిగదా… అనిపించి ఇప్పుడే మొదలెట్టా.

“ఇంత ఉపోద్ఘాతం రాయకముందే ఎందుకు? రాసిన తర్వాత కథని టపా వెయ్యక!” అని మీరనుకొవచ్చు. కానీ ఇదంతా అడ్వాన్స్ గా ఎందుకు చెబుతున్నానంటే, సిగరెట్ మానాలనే వాడు పదిమందికి చెప్పి మానాలంటారు పెద్దలు. దీనివలన, ఒకవేళ ఈ మానవుడు మళ్ళీ కర్మగాలి సిగరెట్ అంటిస్తే,ఎత్తిపొడవడానికి చుట్టూ ఉన్నావాళ్ళు ఉపయోగపడి, వాడి మాన్పుకు తోడ్పడుతారని. అదే విధంగా నేను కథ రాసి, దైర్యం చాలకనో లేక తప్పింఛుకోవాలనో మరో రెండురోజుల్లో పోస్ట్ చెయ్యకపోతే, మీరు ఎత్తిపోడవడానికీ,గుర్తుచెయ్యడానికీ ఉంటారని నా ఆశ. సాహసం శేయరా డింభకా! కథ దక్కుతుందని నాకునేనే చెప్పేసుకుని దూకేస్తున్నా!

May 8, 2008

చల్లటి వేసవి

Filed under: Uncategorized — kathimaheshkumar @ 5:13 pm

May 5, 2008

తెలుగులొ రాస్తున్నా…!

Filed under: Uncategorized — kathimaheshkumar @ 2:25 am

నా బ్లాగుకి అందరికీ స్వాగతం.

దాదాపు పది వసంతాల తరువాత, మళ్ళీ తెలుగు లో రాయడం మొదలు పెట్టా. ఇన్ని రోజులూ తెలుగు లో అలోచించి, ఆంగ్లం లోనో, లేదా హిందీ లోనో దాన్ని తర్జుమాచేసి నా భావాలను ప్రపంచానికి పరిచయంచేసి పంచుతున్నా.మళ్ళీ నా ఆలోచనలని తర్జుమా సంకరం లేకుండా తెలియ జెప్పే అవకాశం కల్పించిన ‘బరహ’ కు, రాసిన రాతను అభినందించి, అందిపుచ్చుకున్న నవతరంగానికి(www.navatarangam.com) ఈ సందర్భం గా కృతజ్ఞతలు.

Theme: Banana Smoothie. Blog at WordPress.com.

Follow

Get every new post delivered to your Inbox.